భద్రాద్రి రాముడేం అన్యాయం చేశాడు?
వేములవాడ రాజన్న ఏం కష్టం కలిగించాడు?
సమ్మక్క-సారక్క ల క్షేత్రం మేడారం జాతరని ఎందుకు విస్మరించారు?
బాసరలో సరస్వతీ దేవీ అలయంలో భక్తుల కష్టాల మాటేమిటి?
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం మాటేమిటి?
భదాద్రి రాముడ్ని పట్టించుకోని సీఎం
భారతదేశ ఇతిహాస గ్రంథాలతో రామాయణంది ఒక ప్రత్యేక పాత్ర.
వనవాసంలో లక్ష్మణుడితో కలిసి సీతా సమేతుడై సాక్షాత్తూ శ్రీరాముడు నడయాడిన నేల ఇది.
పవిత్ర గోదావరి పరవళ్లు ఒకవైపు.. పరమ పుణ్య ధామమైన భద్రాచల క్షేత్రం మరొకవైపు.. మరి మధ్యలో అధికారంలో ఉండి సీఎం కేసీఆర్ ఏం చేశారయ్యా అంటే.. అభివృద్ధిని వదిలి ఆలయాన్ని అనాథలా వదిలేశారని అంటున్నారు. కారణం ఏమిటంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోరు కాబట్టి, ఆయన కూడా శ్రీరాముడిని నిర్దయగా వదిలేశారనే విమర్శలున్నాయి.
రాములవారి కల్యాణం రోజున కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రి దంపతులు తీసుకెళ్లి తలంబ్రాలు ఇచ్చేవారు. క్రమేపీ ఆ సంస్కృతే మారిపోయింది. ఎవరో మంత్రి వెళ్లి, ఆ మర్యాదలవీ పొంది వచ్చేస్తున్నారు.
సమ్మక్క-సారక్కలకు గుడి కట్టారా?
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పిలిచే సమ్మక్క సారక్క జాతర ములుగు నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరుగుతుంది. మేడారం జాతరగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఇక్కడే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఉంది. వీటిని ప్రముఖ పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తానని, సమ్మక్క, సారక్కలకు యాదగిరిగుట్ట స్థాయిలో బ్రహ్మాండమైన ఆలయం కట్టిస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఎక్కడికి పోయిందో తెలీదు.
వేములవాడ రాజన్నకు మాటిచ్చిన కేసీఆర్
దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఏటా వంద కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా పేరుపొందింది. ఆలయానికి వెళ్లే రహదారులు అధ్వానంగా ఉండటం, వర్షం వస్తే చాలు భక్తులకు నరకం కనిపిస్తుందని అంటున్నారు. ఒకసారి వచ్చిన కేసీఆర్, ఇక్కడే మా పెళ్లి జరిగింది.. రాజన్న మా కులదైవం, నేనెట్లా మరిచిపోతా.. ఏటా వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి, అటే వెళ్లిపోయాడు. మళ్లీ పత్తా లేడని అంటున్నారు.
బాసరలో సరస్వతీ దేవీ ఆలయం వద్ద భక్తుల పాట్లు
దేశంలోనే అత్యంత ప్రముఖ దేవాలయంగా బాసరలోని సరస్వతీ దేవీ ఆలయం పేరెన్నికగంది. ప్రతిరోజు కొన్ని వందలమంది ప్రముఖులు, సామాన్యులు, ధనవంతులు తమ పిల్లలు, మనవళ్లను తీసుకుని ఇక్కడికి అక్షరాభ్యాసం కోసం వస్తుంటారు. వారికెవరికి సరైన సౌకర్యాలు లేవు. దూరాభారాల నుంచి వచ్చే వారు ఒకరోజు ఉండాలంటే మాత్రం దేవస్థానం అద్దెగదులు అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా కనిపిస్తున్నాయని ఘొల్లుమంటున్నారు. ఇక్కడ కూడా క్యూలైన్లు సరిగా ఉండవు. ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయిందనే ఆరోపణలున్నాయి.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాభివృద్ధికి ఇస్తానన్న రూ.100 కోట్లు ఏవి?
జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీఆంజనేయ స్వామి ఆలయం దగ్గర జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి పూజలు చేశారు. అదైన వెంటనే సీఎం కేసీఆర్ అక్కడికకి వెళ్లి ఆలయాభివృద్ధికి వందకోట్ల రూపాయలు ప్రకటించారు. అప్పటికప్పుడు ప్లాన్ కూడా వేయించారు. అంతా అయిపోయిందనుకున్నారు. అదేమైందో ఎవరికీ తెలీదు.
ఇదండీ వరస… ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా వీటి అభివృద్ధికి ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా, వాటిని పట్టించుకోవడం లేదనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన పదేళ్లలో దేవాలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినది శూన్యమని అంటున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్టే, ఇక్కడా చేయలేకపోయారని విమర్శిస్తున్నారు.