Revanth Reddy : తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్, బీజేపీల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులపై స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ క్రీడలో పావులుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీల్లో చేరిన వాళ్లు పవిత్రులు.. కాంగ్రెస్ లో చేరితే నేరస్తులా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీల కుట్రతోనే కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. తాండూరులోని RBL ఫ్యాక్టరీలో అధికారులు సోదాలు చేశారు. ఈ ఫ్యాక్టరీ తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా తెలుస్తోంది. వరుసగా కాంగ్రెస్ నేతల ఇళ్లు, సంస్థల్లో ఐటీ దాడులు జరగడంపై రేవంత్ మండిపడుతున్నారు.
ఇంతకు ముందు మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని టార్గెట్ చేస్తూ ఐటీ దాడులు జరిగాయి. ఆయన సన్నిహతులు, బంధువుల ఇళ్లలో అప్పుడు సోదాలు చేశారు ఐటీ అధికారులు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జి. వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఇలా చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులనే టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఐటీ దాడులను కుట్రగా పేర్కొంటూ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హక్కులను ఈసీ కాపాడాలని డిమాండ్ చేశారు.
.
.
.