Shankh Puja : అఖండ అదృష్టం, ఐశ్వర్యం, అభివృద్ధి, కీర్తిప్రతిష్టలు అనుగ్రహించే అఖండ దైవిక వస్తువుగా శంఖాన్ని భావిస్తారు. క్షీర సాగర మథనంలో జనించిన పవిత్ర వస్తువుల్లో ఇదీ ఒకటి. కాబట్టే శ్రీమహావిష్ణువు చేతిలో పాంచజన్యమనే పేరుతో ఇది స్థానం సంపాదించుకుంది. సంపదకు ప్రతీక అయిన శంఖాన్ని పూజాగదిలో ఉంచితే సకల అరిష్టాలు తొలగిపోతాయని హిందువుల విశ్వాసం.
శంఖంలోని జలాన్ని ఆలయాల్లో తీర్థంగా ఇవ్వటం సంప్రదాయంగా ఉంది. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి ఇలా వచ్చినదే. ఫూజా, ఆరాధన, యజ్ఞయాగాదులు, తాంత్రిక క్రియలలోనూ శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక. శంఖాన్ని పూజించడం, అభిషేకించటం మన సంప్రదాయంలో అనాదిగా ఉంది.
కొన్ని ఆలయాల్లో మూలమూర్తి దర్శనం మొదలయ్యే వేళ.. పూజ పూర్తైన తర్వాత శంఖాన్ని ఊదటం సంప్రదాయంగా ఉంది. ఉత్తరాదిన నదీ స్నానాల సమయంలో, శంఖనాదం చేయటం ఆనవాయితీ. ఇక.. సాధుసంతుల దైనందిన జీవితంలో శంఖం ఒక భాగంగా ఉంది. ఇంట్లో దైవారాధనలో భాగంగా శంఖాన్ని పూజిస్తే.. అఖండ ఫలితాన్ని పొందవచ్చని హిందువుల విశ్వాసం.
శంఖాలు రెండు రకాలు. ఒకటి దక్షిణావృత శంఖం. ఇది కుడి వైపు తెరుచుకుని ఉంటుంది. ఇది తెలుపు రంగులో ఉండి దానిపై కాఫీరంగు గీత ఉంటుంది. దీనిని ఎక్కువగా పూజా విధానంలో వినియోగించరు. రోజూ సంధ్యావందనంలో భాగంగా ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే.. నేత్ర సంబంధిత రోగాలు పోతాయని పెద్దలు చెబుతారు.
రెండవది.. వామావృత శంఖం. ఇది ఎడమవైపు తెరుచుకుని ఉంటుంది. పూజలో వాడే శంఖం ఇదే. ఈ వామావృత శంఖం ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు రావని చెబుతారు.
వైదికశాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి అక్కడి వాతావరణంలోని హానికారక క్రిములు నశిస్తాయట. దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానమూ ధృవీకరించింది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబంధిత వ్యాధులు రావని కూడా ఓ అధ్యయనంలో వెల్లడైంది. రాత్రి పూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మసంబందిత వ్యాధులు దూరమవుతాయట.
శంఖాల స్వరూపం, రంగు తదితర లక్షణాలను బట్టి లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రాహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖం. వీటిలో గోముఖ శంఖం వంటి అనేక శంఖాలున్నాయి. వీటిలో గోముఖ శంఖం అత్యంత విశిష్టమైనదిగా చెబుతారు.
ఆవు మొహం ఆకారంలో ఉండే ఈ శంఖం సముద్రంలో అత్యంత అరుదుగా లభిస్తుంది. కైలాస మానస సరోవరంలోను, శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవులలోనూ ఇవి దొరకుతాయి. శివలింగాన్ని గాని, శివపార్వతులను గాని పూజించేవారు ఈ గోముఖ శంఖాన్ని శివుని పాదాల దగ్గర ఉంచి స్వచ్చమైన పూలతో అలంకరించి పూజ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు.
ఇది.. తెలుపు, పసుపుల మిశ్రమ వర్ణం కలిగి ఉంటుంది. ఈ శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ధ తరంగాలు మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. గోముఖ శంఖాన్ని మొదటిసారి పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజుగాని గురువారం రోజు గాని ప్రతిష్టించి పూజించాలి. గోముఖ శంఖంలో గంగాజలాన్ని, ఆవు పాలను నింపి ఇంట్లో, వ్యాపార స్థలంలో చల్లితే నరదృష్టి ప్రభావం ఉండదని, ధనం వృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు.