142 Minor Girls(Telugu flash news):
హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. తప్పుచేస్తే.. విద్యార్థులను దండించాల్సిన ప్రిన్సిపాల్ రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఆరేళ్లుగా 142 మంది విద్యార్థినులతో కామవాంఛ తీర్చుకున్నాడు. వారందరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులే వెలుగులోకి తీసుకొచ్చారు. తమపై జరిగిన అఘాయిత్యాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు లేఖలు రాశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హర్యానా రాష్ట్రం జింద్ లోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు 390 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 15 మంది విద్యార్థినులు తమపై ప్రిన్సిపాల్ చేస్తున్న అఘాయిత్యాల గురించి వివరిస్తూ గత ఆగస్టు నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు లేఖలు రాశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని సూచించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా.. విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరగడం వాస్తవమేనని తేలింది.
నవంబర్ 4న ప్రిన్సిపల్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నవంబర్ 16న అడిషినల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీప్తి గార్గ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ప్రిన్సిపల్ చేసిన దారుణాల గురించి సాక్ష్యం చెప్పేందుకు తొలుత 60 మంది విద్యార్థినులు ముందుకురాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 142 మందికి చేరినట్లు హర్యానా మహిళా కమిషన్ వెల్లడించింది. త్వరలోనే ఛార్జిషీట్ ఓపెన్ చేయనున్నట్లు పేర్కొన్నారు.