తెలంగాణ ఆవిర్భావానికి ముందు గత పాలకులు చేసిన తప్పులే ఇప్పుడూ పునరావృతం అవుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొత్తగూడెంలో సభలో పాల్గొన్న పవన్ తెలంగాణ అవినీతిమయమైందని అన్నారు. ఈ ప్రాంతం రూపు రేఖలు మారాలంటే బీజేపీ- జనసేన కూటమని ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో తనకు మంచి పరిచయాలున్నాయని చెప్పారు. స్నేహం వేరు, రాజకీయం వేరని అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీని డైరెక్ట్గా తిట్టకపోవటానికి కారణం ఉందని.. ఏపీ తరహాలో ఎక్కువగా తెలంగాణలో తిరగలేదని అందుకే విమర్శలు చేయటం లేదని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. తెలంగాణలో అభివృద్ది ఒకే చోట కేంద్రీకృతమైందని అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ కావాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు.
గత పాలకులు చేసిన తప్పులే మళ్లీ ఉత్పన్నం అవుతున్నాయని పవన్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టే అభివృద్ది జరిగిందని.. అక్కడ ఎకరం కోట్లలో పలుకుతుంటే.. పల్లెలు మాత్రం అలాగే ఉండిపోయాయని చెప్పారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు లేవని.. గ్రామాలు అభివృద్ది కావాలని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ప్రతి రైతు, మధ్య తరగితి వ్యక్తి బాగుపడాలని.. కౌలు రైతులు.. అసలు రైతే కాదని చెప్పడం బాధనిపించిందన్నారు. ధరణి కూడా ఫెయిల్ అయ్యిందన్న పవన్ కల్యాణ్ మళ్లీ ఏపీ, కర్ణాటక నుంచి ఉపాధి కోసం యువకులు వస్తే తెలంగాణకు నష్టమని చెప్పుకొచ్చారు. తెలంగాణ యువత పొట్ట కొట్టమని.. పేపర్ లీక్ ఘటన చాలా బాధాకరమని.. యువకులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ నేతృత్వంలోనే విద్య, ఉపాధి అవకాశాలు వస్తాయని.. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ది జరగుతుందని చెప్పుకొచ్చారు పవన్.
ఇంతవరకు బాగానే ఉన్నా అసలు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లోనే మాట్లాడుతున్నారా అనే డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీపై విరుచుకుపడుతున్న జనసేనాని ఇక్కడ మాత్రం సన్నాయి నొక్కులు నొక్కడం విమర్శలకు తావిచ్చేలా చేస్తోంది. పవన్ ప్రచారం అధికార పార్టీని గద్దె దింపేందుకు చేస్తున్నట్లు కనిపించడం లేదనే క్లియర్ కట్గా తేలిపోతోంది. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి పోటీ చేస్తుండగా అక్కడ బీజేపీకి పవన్ ప్రచారం చేయడం హాట్ టాపిక్ అయింది. గతంలో చాలా సార్లు పవన్ తనకు కామ్రేడ్లు అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకులంటే ఆదర్శమని అన్నారు. శ్రీశ్రీ కవితలతో పాటు సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ పవన్ ఊగిపోతుంటారు. మరి కొత్తగూడెంలో పవన్ ఎవర్ని ఓడించాలని ప్రచారం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిందే సీపీఐ. నిజాం నిరంకుశత్వంపై గళమెత్తింది. బండెనక బండి కట్టి అంటూ గద్దర్ వంటి గాయకులు పాటలు కట్టి తెలంగాణ సమాజాన్ని ఏకం చేశారు. పవన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించిన సీపీఐ అభ్యర్థిని ఓడించమని పిలుపునిచ్చేందుకు పవన్ కొత్తగూడెంలో ప్రచారం చేశారా అనే టాక్ నడుస్తోంది.
మొత్తానికి పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచారం పూర్తి భిన్నంగా సాగుతోంది. కరవమంటే కప్పకు.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా జనసేనాని ఆచితూచి స్పందిస్తున్నారు. ఇటు అధికార బీఆర్ఎస్ని నొప్పించకుండా.. అటు బీజేపీని గెలిపించాలనే ఉద్ధేశం లేదనకుండా పాము చావకూడదు.. కర్ర విరగకూడదనేలా పవన్ ప్రచారం సాగించడం యువతను నిరుత్సాహానికి గురిచేస్తోంది.