నన్ను ఆపే ధైర్యం ఎవరికీ లేదు.. నేను సైగ చేస్తే ఇక్కడి నుంచి పోలీసులు పరుగులు పెట్టాలి.. చాంద్రాయణగుట్ట MIM అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ఇలా పోలీసులపై రెచ్చిపోయారు. ఈద్బజార్లో మంగళవారం రాత్రి ఎన్నికల సభలో పాల్గొన్నారు. ప్రచార సమయం ముగుస్తోందని.. ప్రసంగం ముగించాలని సంతోష్నగర్ సీఐ శివచంద్ర అక్బరుద్దీన్కు సూచించారు. తన విధులు నిర్వర్తించిన సీఐపై అక్బరుద్దీన్ ఒంటికాలుపై లేచారు. వెనక్కి వెళ్లాలంటూ గద్దించారు. సీఐపై దుర్బాషలాడారు. ఒక్క సైగ చేస్తే చాలు చాంద్రయాణగుట్ట ప్రజలు పరుగులు పెట్టిస్తారని పోలీసులపై విరుచుకుపడ్డారు.
భావోద్వేగాలు రెచ్చగొట్టడం.. హీరోలా డైలాగ్లు పేల్చడం.. ఓవైసీ బ్రదర్స్ పరిపాటిగా మార్చుకున్నారు. అనేక సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వాళ్లకు సర్వ సాధారణంగా మారింది. గతంలోనూ ఐదు నిమిషాలు పోలీసులు లేకుండా వదిలితే తామేంటో చూపిస్తామని రెచ్చిపోయారు. తాజాగా అక్బరుద్దీన్ తీరు తీవ్ర దుమారానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సంతోష్నగర్ పోలీసులు అక్బరుద్దీన్పై కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో అక్బరుద్దీన్ వాయిస్ మార్చారు. కేసులు తనకేం కొత్త కాదంటూనే.. సంతోష్నగర్ ఇన్స్పెక్టర్ తమపై కక్షగట్టారాని చెప్పుకొస్తున్నారు. ఎంఐఎం సభలను కావాలనే ఇన్స్పెక్టర్ అడ్డుకుంటున్నారని.. గతంలో తమ కాలేజీలోకి చొరబడ్డారని చెబుతున్నారు. ఇన్స్పెక్టర్పై ఆధారాలతో సీఈసీకి ఫిర్యాదు చేశామని ఎదురుదాడికి దిగుతున్నారు.
ఎన్నికల ప్రచారానికి అనుమతి తెచ్చుకున్నాని.. సమయం మించిపోయి నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేయాలని హితవు పలుకుతున్నారు అక్బర్. అంతేగానీ.. పోలీసులే స్టేజ్ మీదకు వచ్చి ప్రసంగం ఆపాలని చెప్పడం ఏంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సమయానికి ఇంకా ఐదు నిమిషాలు ఉన్నా సంతోష్నగర్ సీఐ కావాలనే రెచ్చగొట్టారని అంటున్నారు. తన ప్లేస్లో ఎవరు ఉన్నా ఇలాగే చేస్తారని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు, డీసీపీ అబద్ధాలు చెబుతున్నారని అమాయకంగా బదులిస్తున్నారు అక్బరుద్దీన్.
భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం ఓవైసీ బ్రదర్స్కు బాగానే వర్కౌట్ అవుతోంది. ఎటొచ్చి వీళ్లను నమ్మి మోసపోతోంది పాతబస్తీ ముస్లింలేననే వాదనలు వినిపిస్తున్నాయి. పాతబస్తీ వెనుకబాటుకు ఓవైసీ బ్రదర్సే కారణమనేది గుర్తించడం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా చేస్తున్నారు. మహానగరంలో మెట్రో పరుగులు పెడుతుండగా.. పాతబస్తీకి రాకుండా అడ్డుకున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు మెట్రో తీసుకొస్తామని డైలాగ్లు చెబుతున్నారు. హైటెక్ సిటీ రూపురేఖలు మారిపోగా పాతబస్తీ అలాగే ఉండిపోయింది. అక్కడ తాము చెప్పిందే చట్టం, న్యాయం అన్నట్లుగా ఓవైసీ బ్రదర్స్ వ్యవహరిస్తున్నారు. అందుకే పోలీసులపైనా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. పాతబస్తీ అభివృద్ధి చెందితే తమను ముస్లింలు లెక్కచేయరని.. స్వతంత్రంగా వ్యవహరిస్తారనేదే మజ్లిస్ కుట్రగా కనిపిస్తోంది. ఎన్నికలు రాగానే ముస్లిం యువకులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ఈసారి ముస్లింలు ఓవైసీ సోదరుల తీరును గుర్తించారని.. మైనార్టీలకు చేస్తున్న ద్రోహానికి ఈసారి తగిన బుద్ధి చెబుతారనే అంచనాలు కనిపిస్తున్నాయి. ముస్లిం మతపెద్దలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని చెప్పడం ఓవైసీ సోదరులు జీర్ణించుకోలేకపోతున్నారు.