Suryakumar Yadav : విశాఖలో జరిగిన టీ 20 మ్యాచ్ లో ఓడిపోయే మ్యాచ్ ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటి చేత్తో నిలబెట్టాడు. ఒకవైపు నుంచి ఇషాన్ కిషన్ సాయంతో స్కోర్ బోర్డుని పరుగులెత్తించాడు. మరి ఇంత ఆట.. అహ్మదాబాద్ లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో ఆడితే ఎంత బాగుండేది సూర్యా..సూర్యా !.అని నెట్టింట జనం నెత్తి కొట్టుకుంటున్నారు. తెగ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే టీ 20లో సూర్య 29 బాల్స్ లో ఆఫ్ సెంచరీ చేసి పారేశాడు.
అదే అక్కడ చేసి ఉంటే టీమ్ ఇండియా 290 పరుగులు చేసేది. మళ్లీ ఇక్కడలా 42 బాల్స్ లో 80 చేసేశావు. నువ్వు అహ్మదాబాద్ లో క్రీజులోకి వెళ్లేసరికి దాదాపు అంతే ఆట ఉంది కదా.. మరక్కడ అలా ఆడావేటయ్యా సామీ..బౌలర్స్ కి స్ట్రయిక్ ఇచ్చి నువ్వు నాన్ స్ట్రయిక్ వైపు వెళ్లిపోయేవాడివి..ఏటి సామీ ఇది! అని కామెంట్లు పెడుతున్నారు.
టీ 20 మ్యాచ్ లో 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టుని మళ్లీ సూర్య గాడిలో పెట్టాడు. సీన్ అబాట్ వేసిన ఐదో ఓవర్లో ఇషాన్ కిషన్, సూర్య ఇద్దరూ చెరొక సిక్సర్ బాది 20 పరుగులు రాబట్టారు. అలాగే ఆరో ఓవర్లో కూడా సూర్య విధ్వంసం సాగింది. 6 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్లకు 63 పరుగులు చేసి మళ్లీ ట్రాక్ ఎక్కేసింది. రన్ రేట్ గాడిన పడింది.
అనంతరం 10 ఓవర్లలోనే 102 పరుగులు పూర్తి చేసుకుంది. 17.3 ఓవర్లకి వచ్చేసరికి 5 వికెట్ల నష్టానికి 194 పరుగులతో విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచింది. అప్పటికే రింకూ సింగ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తర్వాత హై డ్రామా నడిచి వికెట్లు పడినా లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి ఘన విజయం అందించాడు.
అయితే అది నో బాల్ కావడంతో సిక్స్ రాలేదు. కానీ విజయానికి ఒక్క పరుగే అవసరం కావడంతో 19.5 ఓవర్లలో 209 పరుగులు చేసి విజయపతాకాన్ని ఎగురవేసింది. అయితే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన బాధలో ఉన్న అభిమానులని మరింత క్షోభ పెట్టకుండా మళ్లీ క్రికెట్ వైపు చూసేలా సూర్య చేశాడని చెప్పాలి.