తెలంగాణ ఎన్నికల యుద్ధంలో గులాబీ సైనికులు అస్త్ర సన్యాసం చేసేశారు. ఈసారి తాము ఓడిపోవడం ఖాయమైపోయిందంటూ కాల్ సెంటర్ల నుంచి కాల్ చేసే వారికి చెప్పేస్తున్నారు. ఎక్కడ తిరిగే పరిస్థితి లేదంటున్నారు. చెప్పాలంటే మౌత్ టాక్ ను ప్రత్యర్థి పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడరే తెలంగాణలో ఎక్కువగా ప్రచారం చేస్తోంది. కనీసం మహిళలకు బస్సు ఫ్రీ అని ఎందుకు చెప్పలేకపోయారని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే గ్రౌండ్ లో బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గులాబీ కార్యకర్తల మైండ్ సెట్ ఎలా మారిపోయిందో ఇదో ఉదాహరణ మాత్రమే. గ్రౌండ్ లో అందరి పరిస్థితి ఇంతే. చేసినవి చెప్పుకోలేరు. జనాలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందుకే ఈసారి మన పనైపోయిందంటూ ముందే గులాబీ జెండా ఎత్తేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ముందు తట్టుకుని నిలబడడం కష్టమని ఒప్పేసుకుంటున్నారు. ఇదొక్కటే కాదు.. స్వయంగా కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిస్తేజమైపోయి ఎదురుగాలి వీస్తోందని మౌత్ టాక్ పెంచుతుండడంతో కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ లో అందరితో మాట్లాడారు. సిరిసిల్లలో తాను ఓడిపోతానని ఎవరో ఏదో అంటే నమ్మేయడమేనా అని ప్రశ్నించారు. ఆ ఊళ్లు బాగా లేదు.. ఈ ఊళ్లు బాగాలేవని మీరే అనుకుని మౌత్ టాక్ పుట్టించి.. మెజార్టీ తగ్గుతుంటూ మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు.
మనం ఎన్ని వేల కోట్లతో డెవలప్ చేసినా ప్రజలకు అందుబాటులో ఉండాలనే విషయం తనకు అర్థమైందని కేటీఆర్ అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్యాడర్, జనం అసంతృప్తితో ఉన్నట్లు గ్రహించే కేటీఆర్ ఈ మాట అన్నారా అన్న టాక్ నడుస్తోంది. మళ్లీ గెలిస్తే సిరిసిల్ల ప్రజలకు మరింతగా అందుబాటులో ఉంటానని కేటీఆర్ చెప్పుకునేదాకా పరిస్థితి వెళ్లింది.
ఎన్నికల యుద్ధంలో పార్టీ కార్యకర్తలే కీలకం. అలాంటిది అసలు సమయంలో గులాబీ సైనికుల్లో నైరాశ్యం బాగా పెరిగిపోయింది. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీస్తోందని, ఎక్కడికి వెళ్లినా ఇదే కనిపిస్తోందని స్వయంగా చెప్పుకుంటున్నారు. ఇక పదేళ్ల ప్రజావ్యతిరేకతను, తీవ్రమైన అసంతృప్తిని అడ్డుకోవడం తన తరం కాదంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్, కేటీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓడిపోతామన్న మౌత్ టాక్ బంద్ చేయాలని సొంత క్యాడర్ నే కేటీఆర్ పదే పదే కోరుతున్నారు.
ఇంకోవైపు ఇప్పుడే అంతా అయిపోయిందనుకోవద్దని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. గాలి మాటలను, గాలి ప్రచారాలను నమ్మొద్దంటున్నారు. ఇంత చేసి సంక్షేమ పథకాలు అందుకున్న వారు ఓటు వేస్తారో లేదోనన్న భయంతో.. బీఆర్ఎస్ నేతలు అన్ని చోట్ల జనంతో ఒట్లు వేయించుకుంటున్నారు. గుళ్లల్లో ప్రమాణాలు చేయిస్తున్నారు. ఇలా మారిపోయింది పరిస్థితి.