కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీకి మద్ధతిచ్చేవారిని కేంద్రం టార్గెట్ చేసిందా? ఈడీ, ఐటీ సోదాలతో వారిని వేధిస్తుందా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తులతో సోదాల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం కూడా ఇలాంటి చర్యే అంటున్నారు.
100 కోట్ల పోంజీ స్కామ్కు సంబంధించిన కేసులో విచారణకు రావాలంటూ ప్రకాష్ రాజ్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. నిజానికి తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యూయెలర్స్ సంస్థపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు. దీంతో ఈడీ ఆయనను కూడా విచారణకు పిలిచింది. ఈ సంస్థ పొంజి స్కీమ్ ద్వారా అధిక లాభాల ఆశ చూపి ప్రజల నుంచి 100 కోట్లు వసూలు చేసింది. ప్రణవ్ జ్యుయెలర్స్ బోర్డు తిప్పేయడంతో ఆ సంస్థ యజమాని మదన్పై తమిళనాడులోని ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరుపుతున్న ఈడీ ప్రకాష్ రాజ్కు నోటీసులు జారీ చేసింది.
నిజానికి ప్రకాష్ రాజ్ బీజేపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ అనేక సార్లు విమర్శలు చేశారు. గతంలో మోడీ ఇంటిపేరు మీద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ మద్ధతుగా నిలిచారు. రాహుల్పై అనర్హత వేటు వేసిన సమయంలో కూడా బీజేపీ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో దేశం కోసం మాట్లాడే సమయం వచ్చిందంటూ ట్వీట్ చేశారు. ప్రకాష్రాజ్ చేసిన ఈ ట్వీట్స్ అన్నీంటిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అందుకే ప్రకాష్ రాజ్కు సంబంధించి ఏ చిన్న వివాదమైనా కేంద్ర ఏజెన్సీలను రంగంలోకి దించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.