తెలంగాణలో ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఈసీ పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్రాజ్ తెలిపారు. 6 అసెంబ్లీ సెగ్మంట్లలో 5 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. 36 వేల ఈవీఎంలు సిద్ధం చేశామని చెప్పారు. 60 మంది వ్యయ పరిశీలకులను నియమించామని చెప్పారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక పరిశీలకుడు ఉంటారన్నారు.
ఇప్పటికే సర్వీస్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని వికాస్ రాజ్ తెలిపారు. 3 కేటగిరీల వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించామన్నారు. ఇప్పటికే 9 వేల మందికిపైగా ఓటర్లు హోమ్ ఓటింగ్ వేశారని వెల్లడించారు. ఈ సారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ప్రింట్ చేసి పోస్టల్ శాఖ ద్వారా పంపామని వివరించారు. ఇప్పటికే 86 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో 18-19 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నారని ప్రకటించారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వికాస్ రాజ్ చెప్పారు.
పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టిపెట్టింది. పోలింగ్ రోజు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల మోహరిస్తామన్నారు. 391 రూట్ మొబైల్స్, 129 గస్తీ వాహనాలు, 220 బ్లూకోల్ట్స్, అదనంగా 122 వాహనాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో రూట్ మొబైల్లో 3 సాయుధ బలగాలు, ఒక కానిస్టేబుల్, 45 ఫ్లయింగ్ స్క్వాడ్, 45 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నాయన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్కు విధుల్లో ఉంటారని తెలిపారు.
బంజారాహిల్స్లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎన్నికలపై హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సమీక్ష నిర్వహించారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో నిఘా పెట్టామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ చేస్తామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పరిశీలకులు విధుల్లో ఉంటారని తెలిపారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇలా అటు ఎన్నికల అధికారులు, ఇటు పోలీసులు పోలింగ్ కు సర్వం సిద్ధం చేస్తున్నారు.