JP Nadda : తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ బీజేపీ కూడా ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేసింది. బీసీ సీఎం నినాదంతో ఎన్నికల రణక్షేత్రంలోకి దిగింది కాషాయ దళం. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి బహిరంగ సభల్లో పాల్గొని క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రంగంలోకి దిగారు.
నిజామాబాద్లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభకు హాజరైన నడ్డా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయన్నారు. బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన ఈ పదేళ్లలో కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే బాగుపడిందన్నారు.
తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని నడ్డా విమర్శించారు. దళిత బంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. అందుకే కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు.
పీఎం ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదని నడ్డా ఆరోపించారు. ప్రధాని మోదీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి చేరిందన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. దేశంలో పలు రాష్ట్రాలకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించామని.. అలాగే తెలంగాణలో మార్పురావాలని నడ్డా పిలుపునిచ్చారు.