Sreesanth : నిత్యం వివాదాల్లో ఉండే… భారత్ క్రికెటర్ శ్రీశాంత్ మరో కేసులో చిక్కుకున్నాడు. ఈ ఫాస్ట్ బౌలర్ తోపాటు మరో ఇద్దరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
కర్ణాటకలోని కొల్లూరులో క్రికెటర్ శ్రీశాంత్ భాగస్వామిగా స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని చెప్పి 2019 ఏప్రిల్ 25 నుంచి అనేక సార్లు నిందితులు రాజీవ్ కుమార్, వెంకటేష్ కిని రూ. 18.70 లక్షలు తీసుకున్నారని చూండా ప్రాంతానికి చెందిన ఫిర్యాదుదారు సరిష్ గోపాలన్ ఆరోపించారు. ఈ అకాడమీలో భాగస్వామి అయ్యే అవకాశం రావడంతో ఆ డబ్బును పెట్టుబడి పెట్టానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
బాధితుడి ఫిర్యాదుతో శ్రీశాంత్తోపాటు మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 420 కింద అభియోగాలు మోపారు కేరళ పోలీసులు. ఈ కేసులో శ్రీశాంత్ ను మూడో నిందితుడిగా పేర్కొన్నారు.