ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందంటూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎం వైఎస్ జగన్ సహా కొంతమంది మంత్రులు, అధికారులకు నోటీసులు ఇచ్చింది. మొత్తం 41 మందికి నోటీసులు పంపింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.
ఏపీలో అమలు చేస్తున్న పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ లో ప్రజా ప్రయోజనాలేవి లేవని స్పష్టంచేశారు. కేవలం వ్యక్తిగత దురద్దేశాలతో పిటిషన్ వేశారని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదన్నారు.
మరోవైపు పిటిషనర్ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది తమ వాదన వినిపించారు. ఈ పిటిషన్ హైకోర్టులో వేయగానే.. ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.