BJP-BRS : బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే. గులాబీ పార్టీ కమలం పార్టీకి బీ టీమ్. స్వయంగా ప్రధాని మోడీ కూడా ఇందూరు సభలో ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పారు. గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వూలో నోరు జారారు. ఈ డ్యామేడ్ కంట్రోల్ను ఎలాగైనా కవర్ చేసుకునేందుకు మరోసారి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను తెరపైకి తెచ్చి రైతులను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్-బీజేపీ వేర్వేరు అని చెప్పుకునేలా మళ్లీ రెండు పార్టీలు డైలాగ్ వార్ షురూ చేశాయి. కరెంట్ విషయం పక్కకుపెట్టి…లేటెస్ట్గా మోటార్లకు మీటర్ల ఇష్యూను ఎత్తుకుంటున్నాయి. సభల్లో కేసీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుండగా.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇస్తూ హైలైట్ అయ్యేలా సపోర్ట్ చేస్తున్నారు.
ఎన్నికల ముందు బీజేపీ-బీఆర్ఎస్ రూట్ మార్చేశాయా? ఆ రెండు పార్టీలు ఒక్కటి కాదు అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయా? తెలంగాణకు కేంద్రం నిధులు ఆపేసిందని పాత స్టోరీని కొత్తగా ఎత్తుకోవడం అంతా వ్యూహాత్మకమేనా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది. మోటర్లకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం 25 వేల కోట్ల నిధులు ఆపేసిందంటూ ప్రతి సభలో సీఎం కేసీఆర్ ఆరోపిస్తూ వస్తున్నారు. తల తెగి పడినా ఆ పని చేయబోనని చెప్పానన్నారు. అందుకే కేంద్రం కక్ష సాధింపు చేస్తోందన్నారు.
అయితే ఈ విషయంపై హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకే.. తెలంగాణకు అదనపు రుణానికి అనుమతి ఇవ్వలేదన్నారు. రూల్స్ పాటించకుండా అదనంగా అప్పు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మిగితా రాష్ట్రాలకు ఒక రూల్, తెలంగాణకు మరో రూల్ అంటే మిగితా వాటి పరిస్థితి ఏంటని నిలదీశారు. అసలు తెలంగాణకు ఎప్పుడు నిధులు ఆపామో చెప్పాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఏదీ దొరకకపోవడం, జనాలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో ప్రధాని మోడీ మోటార్లకు మీటర్లు పెట్టమన్నారంటూ జనంలోకి వెళ్తున్నారని ఫైర్ అయ్యారు.
మంత్రి కేటీఆర్ కూడా ఉన్నట్లుండి ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న దుబ్బాక రోడ్ షో లో బీజేపీపై నిప్పులు చెరిగారు. మోటార్లకు మీటర్లు పెట్టని కారణంగా తెలంగాణకు పాతిక వేల కోట్ల రూపాయలు నిలిపివేసిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. సీన్ కట్ చేస్తే తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. 12 రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, అలా చేస్తేనే నిధులు విడుదల చేస్తామంటే అక్కర్లేదని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారన్ననారు. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా సీఎం కేసీఆర్ మాత్రం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మోటార్లకు మీటర్లు పెట్టటాన్ని వ్యతిరేకించారని కవర్ చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మోటార్లకు మీటలు తప్పవంటున్నారు.
మోటార్లకు మీటర్లు కొత్త టాపిక్ కాదు. ఇన్నాళ్లూ ఈ ఇష్యూ పక్కకు పెట్టి సరిగ్గా పోలింగ్కు వారం ముందు ఈ టాపిక్ను పట్టుకోవడం వెనక మేటర్ ఏంటో క్లియర్గా కనిపిస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ బీ టీమ్ బంధం దాచేందుకే ఈ ప్రయత్నమనే టాక్ నడుస్తోంది. గతంలో అనేక అంశాలు వీళ్లు గిచ్చినట్లు.. వాళ్లు ఏడ్చినట్లు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయమైతే పీక్స్కు తీసుకెళ్లారు. ఇప్పుడు ఏ మేటర్ పనిచేయకపోవడం వల్లే ఎన్నికల్లో మీటర్ ఇష్యూను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఈ మీటర్ ఎపిసోడ్లో కాంగ్రెస్ ప్రమేయం లేకపోయినా.. కేంద్రాన్ని నిందించి కేసీఆర్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారనేది స్పష్టమవుతోంది.
.
.