Telangana Elections : తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో పోలింగ్ శాతంపై అధికారులు దృష్టి సారించారు . ప్రతీ ఒక్కరు తమ ఓటు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలింగ్ శాతంపై ఫోకస్ పెట్టారు. ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడతున్నారు. గత ఎన్నికల్లో పల్లెలు, తండాల్లో అనుకున్న మేర ఓటింగ్ నమోదైతే.. ఉద్యోగులు, విద్యావంతులు, వలస వచ్చినవారు, కార్మికులు అధికంగా ఉండే ప్రాంత ప్రజలు ఓటు వేయడంలో వెనుకపడ్డారు. దీంతో ఈసారి వారిచేత కూడా ఓటు వేయించి పోలింగ్ శాతాన్ని పెంచే పనిలో ఉన్నారు అధికారులు.
గత 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని చూస్తే.. 2014 కంటే 2018లో 1.62 శాతం పెరిగింది. 2014 ఎన్నికల్లో 65.72 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2018 ఎన్నికల్లో 67.34 శాతం నమోదైంది. గత ఎన్నికల్లో అత్యధికంగా షాద్నగర్లో 87.57 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 48.51 శాతంగా నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లిలో పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదుకావడంపై అధికారులు ఆరా తీశారు. విద్యావంతులే ఓటింగ్కు దూరంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ సారి శేరిలింగంపల్లి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తూ అవగాహన కార్యక్రమాల్ని చేపడుతున్నారు.
తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో వికారాబాద్ జిల్లా వాసులు ముందుస్థానంలో ఉన్నారు. గత ఎన్నికల ఓటింగ్ శాతాన్ని చూస్తే… 2014 ఎన్నికల్లో 69.66 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2018 ఎన్నికలో 76.92 శాతం నమోదైంది. పోలింగ్ శాతంలో రంగారెడ్డి జిల్లాను మించిపోయింది. అలాగే మేడ్చల్ జిల్లాలోనూ అంతంత మాత్రంగానే పోలింగ్ శాతం నమోదైంది. 2014 ఎన్నికల్లో 52శాతం పోలింగ్ నమోదు కాగా.. 2018 ఎన్నికల్లో 55.62 శాతం నమోదైంది. స్వల్పంగా 0.62 శాతం పోలింగ్ పెరిగింది.
ఈ లెక్కలను బట్టి గ్రామాల్లో పోలింగ్ శాతం పెరగుతోంటే పట్టణాల్లో మాత్రం తగ్గుతుంది. దీంతో పట్టణాల ఓటింగ్పై దృష్టి సారించారు అధికారులు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు, యువతకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలతో ర్యాలీలు నిర్వహించి ఓటు ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. బస్టాండు, రైల్వే స్టేషన్లతో పాటు జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది ఇంటింటి వెళ్లి ఓటు ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. సోషల్ మీడియా వాడకం ఎక్కువైనందున సామాజిక మాద్యమం ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.