KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ హామీలివ్వడంలో మంచి దిట్టగా పేరుపొందారు. అంతేకాదు అరచేతిలో వైకుంఠం చూపించడంలో ఆయన్ని మించినవారు లేరని అంటారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన దగ్గర నుంచి చూస్తే ఒకటి కాదు, రెండు కాదు లెక్కలేనన్ని హామీలతో ప్రజలను మోసగిస్తూనే వెళ్లారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల టైమ్ కి హడావుడిగా ప్రకటించడం, ఓట్లు వేయించుకోవడం ఇదే తంతుగా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో దళితబంధుని ప్రకటించారు. అక్కడ ప్రజలందరికీ ఒకే మాట చెప్పారు. ఈసీ నోటిఫికేషన్ వచ్చింది. జీవోలు జారీ చేయడానికి లేదు. ఇదిగో రూ.10 లక్షల దళితబంధు పథకం.. మీరు ఓట్లేయండి.. గెలిపించండి.
మళ్లీ ఇక్కడ సభ పెట్టుకుందాం.. నేనే వస్తా, నేనే ఇస్తానని అన్నారు. కేసీఆర్ మాట మీద నమ్మకం లేదా? అంటూ పంచ్ డైలాగు కొట్టి, ప్రజలను మెస్మరైజ్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిన విషయమే. నిరుపేదల ఆశలతో ఆడుకోవడం కరెక్టు కాదని ప్రొఫెసర్ కోదండరామ్ లాంటివాళ్లు కేసీఆర్ కి హితబోధ చేసినా ఆయన పట్టించుకోవడం లేదు. మంచి మాటలు చెబుతున్నాడని బయటకు గెంటేశారు.
అలా ఇప్పటికి కొన్ని హామీలు నెరవేరక, ఆశ తీరక తెలంగాణ ప్రజలు అలా ఎదురుచూస్తూనే ఉండిపోయారు. ఇప్పటికి పదేళ్లు గడిచిపోయింది.. ఇంకా కేసీఆర్ చెబుతూనే ఉన్నారని, ఆ నాలిక్కి నరం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు చాలా వెరైటీగా కేసీఆర్ హామీలను వివరిస్తున్నారు. అవెలాగంటే…
బంగారు తెలంగాణ.. పాయే..
డబుల్ బెడ్రూం ఇళ్లు.. పాయే
ఇంటికో ఉద్యోగం.. పాయే
కేజీ టు పీజీ.. పాయే
మిషన్ భగీరథ.. అంతంతమాత్రమాయే..
మిషన్ కాకతీయ.. ఎక్కడుందో తెలీదాయే..
ఇంటింటికి కుళాయి.. పాయే..
ఊరూరా వనం పాయే..
దళితులకు మూడెకరాల భూమి.. పాయే
దళిత ముఖ్యమంత్రి.. పాయే
దళిత బంధు ఇంకేం ఉంది.. అదీ పాయే..
రైతు రుణ మాఫీ.. అది కూడా పాయె..
బీసీ బంధు.. పాయే, రైతు బీమా పాయే..
తెలంగాణ పల్లె ప్రగతి పథకం.. పాయే..
మన ఊరు.. మన ప్రణాళిక పాయే
మన ఊరు.. మన కూరగాయలు పాయే..
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం పాయే
ఆరోగ్య మహిళ పాయే..
గృహలక్ష్మి పథకం పాయే
ఇలాంటివెన్నో పథకాలు పాయే.. పాయే.. అంటున్నారు. ఇవికాకుండా అక్కడికక్కడ స్పాట్ లో నోటికొచ్చిన హామీలకైతే లెక్కేలేదు. ఒక నియోజకవర్గానికి వెళ్లడం అక్కడ అలవికాని హామీలివ్వడం, అంతే మళ్లీ కారెక్కి వెళ్లిపోవడం లేదంటే హెలికాఫ్టర్ ఎక్కి ఎగిరిపోవడం ఇదీ తంతు. మళ్లీ వాటివైపు చూసిన పాపాన పోలేదని విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి.
బంగారు తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబమే బంగారం అయ్యిందని అంటున్నారు. తెలంగాణ వచ్చినా పేద ప్రజల బతుకులు మారలేదు కానీ.. కేసీఆర్ కుటుంబం బాగుపడిందనే భావన సర్వత్రా వ్యాపించింది.
ఇందులో ఏ ఒక్క పథకమైనా పట్టుమని ఏడాదైనా ఉందా? కేసీఆర్ ? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. నిలదీస్తున్నారు. అలా ప్రశ్నించిన వాళ్లని అణగదొక్కడం, పోలీస్టేషన్లలో పెట్టడం తెలంగాణలో షరా మూములైపోయిందని విమర్శిస్తున్నారు.