విద్యాబుద్ధులు నేర్పి.. శిష్యుల జీవితాలకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు కామరూపాన్ని ఎత్తాడు. విద్యార్థినికి ప్రేమ పాఠాలు నేర్పి.. తాళి కట్టి.. మనిద్దరికీ పెళ్లైపోయిందని చెప్పి.. అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భీమవరం గ్రామీణ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు.. జిల్లాలోని మరో మండలంలో ఉన్న పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తున్నాడు. విద్యాబుద్ధులు నేర్పి.. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అతను.. పదో తరగతి విద్యార్థినిపై కన్నేశాడు.
నిన్నే ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను ట్రాప్ చేశాడు. ఈ నెల 19వ తేదీన బలవంతంగా స్కూల్ నుంచి తన స్వగ్రామమైన తాడేరుకు తీసుకెళ్లాడు. బాలికకు అక్కడే తాళి కట్టి ఇద్దరికీ పెళ్లైపోయిందన్నాడు. ఊహించని పరిణామంతో షాక్ లో ఉన్న ఆ విద్యార్థినికి మరో షాకిచ్చాడు. తనలో ఉన్న పశువుని నిద్రలేపి.. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా.. బాలిక ఆచూకీ తెలుసుకున్నారు.
జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. దిగ్భ్రాంతి చెందారు. వాడు టీచర్ కాదు.. పశువు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై బుధవారం (నవంబర్22) పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడు సోమరాజుపై అత్యాచారం, పోక్సో, బాల్యవివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసును దిశ డీఎస్పీ ఎన్.మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. అభం శుభం ఎరుగని బాలికపై ఇంతటి దారుణానికి పాల్పడిన కీచక ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. సోమరాజుకు గతంలోనే పెళ్లై.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.