KTR : ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ ఇంటర్వ్యూలు వివాదాస్పదమవుతున్నాయి. తెలంగాణ రణరంగంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. నువ్వానేనా అన్న రేంజ్లో ఎన్నికల సమరం సాగుతోంది. అయితే.. ఈ సమయంలో ఏ చిన్న అవకాశం దొరికినా కాంగ్రెస్ అస్త్రంగా వాడుకుంటూ విమర్శలు గుప్పిస్తోంది. అంతటితో ఆగకుండా ఎన్నికల అధికారి వరకు పంచాయితీని తీసుకెళ్తూ కేటీఆర్ను ఇరకాటంలో పెట్టే ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ, కవి గోరేటి వెంకన్నతో కేటీఆర్ చేసిన ఇంటర్వ్యూ, టీహబ్లో యువతతో సమావేశంపై ఈసీ ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు.
నిరుద్యోగ యువతతో ఇటీవల మంత్రి కేటీఆర్ టీహబ్లో సమావేశమయ్యారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన యువత బీఆర్ఎస్పై కన్నెర్ర చేస్తున్నారు. తమను పట్టించుకోని కేసీఆర్ను గద్దె దించాలని ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతను పోగొట్టి .. తమను బుజ్జగించే పనిలో భాగంగా కొందరు యువతతో కేటీఆర్ సమావేశమై.. మళ్లీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు పక్కా అనే హామీని, భరోసాను కల్పించారు. అయితే,.. ఈ భేటీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో అధికార హోదాను దుర్వినియోగం చేశారని.. అధికార భవనాలను వాడుకున్నారని ఆరోపించింది. అలాగే ఇకపై రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశించాలని ఫిర్యాదులో కోరింది. ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మరోవైప గోరెటి వెంకన్నతో కేటీఆర్ చేసిన ఇంటర్వ్యపై కూడా సీఈవో వికాస్రాజుతోపాటు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత నిరంజన్. అమరవీరుల స్మారక ప్రాంగణంలో ఇంటర్వ్యూ నిర్వహించడం.. అలాగే ఆ సమయంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్వాహకుడిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వ సంస్థలను వారి కార్యకలాపాలకు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత నిరంజన్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్ ఎగురవేసింది ఎవరన్న దానిపై కూపీ లాగుతున్నారు.
.
.