Manthani : మంథని నియోజకవర్గ తమ పార్టీ నేతలపై దాడి వెనుక భారీ కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. బక్కన్న దంపతులను హత్య చేయాలని బీఆర్ఎస్ నేతలు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. వామనరావు దంపతుల హత్య తరహాలో కుట్ర పన్నారంటున్నారు.
మహాముత్తారం మండలం మీనాజీపేటలో కాంగ్రెస్ నేత బక్కన్న దంపతులపై దాడి జరిగింది. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. బక్కన్న ప్రచారానికి ఆదరణ వస్తుండటంతో దాడి చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ దాడులకు దిగుతోందంటూ ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ నేతల దాడికి నిరసనగా మంథని బంద్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు సహా 28 మందిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కోరారు. కాంగ్రెస్ శ్రేణులే తమపై దాడికి పాల్పడ్డారని కౌంటర్ ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు, బక్కన్నతో సహా మరో ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై శ్రీధర్బాబు మండిపడ్డారు. మంథని చౌరస్తాలో నిలబడతా.. బీఆర్ఎస్ నేతలను వచ్చి చంపమను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీనాజీపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బక్కన్న దంపతులపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు. రహదారిపై బైఠాయించి, నిరసన తెలిపారు. దాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.