Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. వరంగల్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. హనుమకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తెలంగాణ తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అదే స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నానని అన్నారు.
తన పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోందని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలా తిరుగుతున్నానో ఈ రాష్ట్రంలోనూ అలాగే తిరుగుతున్నానన్నారు. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేశారో అది సాధిస్తానన్నారు. తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానని వివరించారు. ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో అవినీతి రాజ్యమేలడం బాధ కలిగిస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా దళిత సీఎంను చూడలేకపోయామని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే బీసీనైనా సీఎంను చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీతో కలిశానని చెప్పారు. తనకు ఆంధ్రప్రదేశ్ జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు తాను కూడా మద్దతు ఇచ్చానన్నారు.
వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ పర్యటిస్తానన్నారు. డబ్బు లేకపోయినా బలం లేకపోయినా గుండెబలంతో నిలబడ వచ్చని వరంగల్ గడ్డ నుంచి నేర్చుకున్నానని స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రావు పద్మ , వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావును గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.