Mallikarjun kharge : తెలంగాణకు ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అలంపూర్, నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభల్లో బీజేపీ, బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ స్ఫూర్తితో పేదల కోసం పనిచేస్తూనే ఉంటామన్నారు. పేదల హక్కుల కోసం పోరాతామని తేల్చిచెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఖర్గే విమర్శలు చేశారు. ఆయన ఎప్పుడూ ప్రజలను కలవలేదన్నారు. ఇలాంటి నాయకుడికి ప్రజలు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరా గాంధీని తిట్టే స్థాయి కేసీఆర్ లేదన్నారు.పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఏం చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనన్నారు. ఈ ఇద్దరు నేతలకు పేదల కష్టాలు పట్టవని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధిని ఖర్గే వివరించారు. కాంగ్రెస్ చేపట్టిన హరిత విప్లవం వల్లే దేశంలో ఆహార కొరత తీరిందన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించకుంటే తెలంగాణ ఎలా ఉండేది? అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. రైతులు, దళితులు, నిరుపేదలకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యమని పేర్కొన్నారు. హరిత, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.
తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని ఖర్గే ఆరోపించారు. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబం ఉందన్నారు. కాంగ్రెస్ పై మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికపై కుట్ర చేశారని ఆరోపించారు.