Raghu Rama Krishna Raju : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను మరోసారి టార్గెట్ చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా వైఎస్ జగన్ బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. జగన్ బెయిల్ రద్దు చేసి, అక్రమాస్తుల కేసులపై విచారణ వేగవంతం చేయాలని గతంలోనే తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ కూడా దాఖలు చేసింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రఘురామ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణ హైకోర్టు తీర్పును రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.