ICC New Rule : అంతర్జాతీయ క్రికెట్ లో బౌలర్లు బాల్ బాల్ కి ఫీల్డర్లను సెట్ చేసుకోవడం, కెప్టెన్ సూచనలు, సిగ్నల్స్ అందుకోవడం, లేదంటే గ్రూప్ డిస్కర్షన్స్, ఇవన్నీ కాదంటే ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనే ఆలోచనతో కెప్టెన్ సమయం వేస్ట్ చేయడం, ఇక ఫీల్డర్లు బాల్ దొరకగానే దానిని పట్టుకుని రుద్దుతూ కూర్చోవడం, ఇలాంటి విన్యాసాల వల్ల ఓవర్ ఓవర్ కి మధ్య చాలా గ్యాప్ వస్తోందని నిపుణులు గమనించారు. వీటిని నివారించడానికి సాఫ్ట్ క్లాక్ పద్ధతిని వన్డే, టీ20 క్రికెట్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు.
దీనివల్ల ఆటలో వేగం పెరుగుతుంది. సమయానికి ముగుస్తుంది. లేకపోతే అటూ, ఇటూ కూడా 50-50 ఓవర్లు అంటే 100 ఓవర్లు వేస్తారు దీనివల్ల మ్యాచ్ చాలా ఆలస్యం అవుతోందని అంటున్నారు. అందుకే సాఫ్ట్ క్లాక్ సిస్టమ్ వైపు ఐసీసీ మొగ్గు చూపిస్తోంది. అయితే ఇంకా అనుకున్నారో లేదో, అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాకపోతే ఈ విషయంపై ఐసీసీ మాత్రం సీరియస్ గానే ఉంది. కొన్ని నిబంధనలు కూడా పెట్టింది, అవి అతిక్రమిస్తే పెనాల్టీలు కూడా ఉన్నాయని చెబుతోంది. విషయం ఏమిటంటే ఓవర్ పూర్తయిన 60 సెకన్లలో మరో ఓవర్ పడిపోవాలి. ఇలా రెండు అవకాశాలిస్తారు. మూడోసారి కూడా ఆలస్యమైతే ఆలస్యం చేసిన జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వన్డే, టీ 20 మ్యాచ్ ల్లో డిసెంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. ఇక్కడ ఎదురయ్యే ప్రాక్టికల్ ఇబ్బందులను పరిశీలించి తర్వాత శాశ్వత నిబంధన విధించే విధంగా ఆలోచన చేస్తారని అంటున్నారు. అంతిమంగా ఓవర్ల మధ్య ఆలస్యం లేకుండా చూడాలన్నదే తమ ఉద్దేశం అని బోర్డు సభ్యులు చెబుతున్నారు.
ఇంతకుముందు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు నుంచి కోత కోయడం, లేదా రెండు మూడు ఆటలు నిషేధం విధించడం, లేదా కెప్టెన్ కే క్రమశిక్షణ చర్య విధించడం చాలా చేశారు గానీ, ఎక్కడా మార్పు రాలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిబంధన విధిస్తున్నట్టు తెలిపారు.
ఒక పావుగంట ఆలస్యమైతే కొంపలేం అంటుకుపోతాయి. అంత పెద్ద ఆటలో జరుగుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా 5 పరుగులంటే మాటలు కాదు. ఒకొక్కసారి ఆఖరి ఓవర్ కీలకం అవుతుంది. అప్పుడు లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించినా, పెనాల్టీలో పడితే ఓడిపోయే అవకాశం ఉంది. ఐసీసీ మెగా టోర్నమెంటుల్లో ఇలాంటివి కొంప ముంచుతాయని అంటున్నారు.
అయితే ఇదంతా ఎందుకంటే, ఇంటర్నేషనల్ మ్యాచ్ శాటిలైట్ రైట్స్ ని వందల కోట్ల రూపాయలకి అమ్ముతారు. అందులో ఈ టైమ్ నుంచి ఈ టైమ్ వరకు అని టైమ్ స్లాట్ ఉంటుంది. అదేమాత్రం దాటకూడదు.
ఎందుకంటే ఆ పావుగంట ఆ శాటిలైట్ చానల్ నుంచి వేరే వాళ్లకెవరికో ముందుగానే ఇచ్చేసి ఉంటారు. అవి అన్నీ క్యూ లైనులో ఉంటాయి. వాటికి లైవ్ రాదు.
అలా ఒక్కపావుగంట ఆలస్యం మొత్తం రోజు షెడ్యూల్ ని తారుమారు చేసేస్తుంది. దీనివల్ల ఐసీసీకి భారీగా కోట్ల రూపాయల్లో పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే లాభం గూబల్లోకి వచ్చేస్తుందన్నమాట.
ఇది కేవలం మ్యాచ్ ఆలస్యం కావడం వల్ల వస్తున్న ముప్పు..దాన్ని తప్పించుకోడానికే ఐసీసీ ఇన్ని చిన్నులు చేస్తున్నారని సమాచారం.