Trisha vs Mansoor : సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హీరోయిన్ గా నటించి మళ్లీ స్టార్ క్రేజ్ సంపాదించుకున్న త్రిషపై మన్సూర్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. త్రిషపై అతను చేసిన వ్యాఖ్యలను లియో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సహా.. చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, సింగర్ చిన్మయి ఖండించారు.
ఇటీవల మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, లియో సినిమాలో కూడా త్రిషతో అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నానని, కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ లేకపోవడంతో బాధగా అనిపించిందన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. త్రిష దృష్టికి చేరింది. మన్సూర్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వారి వల్లే ఇండస్ట్రీలో అందరికీ చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల అసోసియేషన్ (నడిగర్ సంఘం) కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మన్సూర్ అలీపై తాత్కాలిక నిషేధం విధించింది. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే బ్యాన్ ను తీసువేస్తామని తెలిపింది. దాంతో స్పందించిన మన్సూర్ అలీ.. నడిగర్ సంఘం తనను ఎలాంటి వివరణ అడగకుండా నిషేధం విధించి తప్పుచేసిందన్నారు. తనకు వ్యతిరేకంగా నడిగర్ సంఘం ఇచ్చిన స్టేట్ మెంట్ ను నాలుగు గంటల్లో వెనక్కి తీసుకోవాలని మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో చెప్పారు.
అయినా తానేమీ తప్పు చేయలేదని, తనకు తమిళ ప్రజల సపోర్ట్ ఉందని మన్సూర్ అలీ తెలిపాడు. సినిమాల్లో హత్యచేస్తే నిజంగానే చేసినట్లా ? సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా ? అని తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. త్రిష గురించి తానేమీ తప్పుగా మాట్లాడలేదని, ఆమెకు క్షమాపణలు చెప్పేదే లేదని మన్సూర్ అలీ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. తానేంటో తమిళ ప్రజలకు తెలుసని పేర్కొన్నాడు.
మరోవైపు మన్సూర్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి.. మన్సూర్ పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చెన్నైలోని నంగంబాక్కం పోలీసులు మన్సూర్ పై కేసు నమోదు చేశారు.