Election Commission Shock to BRS : అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇవ్వనుందా? తమ ప్రతిష్టకే మచ్చ తెచ్చేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రకటనలు ఇవ్వడంపై కొరడా ఝులిపించనుందా? రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థగా నిబద్ధతని నిలబెట్టుకుంటుందా? లేదంటే చూసీ చూడనట్లు వదిలేయనుందా? ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఇదే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా ఈసీ ఎందుకు ఉపేక్షిస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పలు అంశాలపై చర్యలు ఉదహరిస్తూ గులాబీ పార్టీ ధిక్కార వైఖరిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలే టార్గెట్గా ఐటీ రైడ్స్ జరుగుతుండటం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే టాక్ నడుస్తోంది.
దేశంలో ఎక్కడ జరిగినా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా CEC తీసుకునే నిర్ణయాలే అంతిమం. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందంటే అధికారాలు అంతా ఎన్నికల సంఘం కనుసన్నల్లోనే పనిచేయాలి. ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా వ్యవహరించాలి. ఎన్నికల ఖర్చు దగ్గర్నుంచి ప్రతి అంశంపై ఈసీ నిఘా పెడుతుంది. అభ్యర్థుల ప్రచారానికి అనుమతులు సహా ప్రకటనలు తదితర అంశాల్లోనూ వివక్ష చూపకుండా ఈసీ చర్యలు తీసుకోవాలి.
పక్షపాతంగా వ్యవహరించే అధికారులపై ఎన్నికల అధికారులు కొరడా ఝులిపిస్తారు. తీవ్రతను బట్టి కఠిన నిర్ణయాలు అమలు చేస్తుంది. ఓటర్ల జాబితాలు సరిచూడటం, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ నిర్వహించడం ఎన్నికల సంధం ప్రధాన విది. ఇటీవల ప్రభుత్వానికి వంత పాడుతున్నారనే ఫిర్యాదులతో పోలీస్ కమిషనర్లు, ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. అయినప్పటికీ మరికొంత మంది బీఆర్ఎస్ సర్కార్కు తొత్తులుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ తమ వినతులపై స్పందన రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందంటూ కాంగ్రెస్ బృందం సీఈఓ వికాస్ రాజ్ను కలిసి కంప్లైంట్ చేసింది. ప్రభుత్వ భవనాల్లో కేటీఆర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఫిర్యాదు చేసింది. అమరుల జ్యోతి దగ్గర కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారని ప్రస్తావించింది. న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇవ్వడంపైనా కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ప్రభుత్వ భవనాలను ఉపయోగిస్తే నిబంధనల ప్రకారం మూడు రోజుల్లో దేశంలో ఎక్కడైనా ప్రచారం చేయకుండా సస్పెండ్ చేయాల్సి ఉంటుందని AICC నేత అజయ్.. ఈసికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎలక్షన్ యాడ్స్లో.. అనుమతి తీసుకున్న ప్రకటనలకు భిన్నంగా ప్రకటనలు ఇస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కోడ్ ఉల్లంఘిస్తూ తప్పుడు ప్రకటనలతో కేసీఆర్, కేటీఆర్ ఈసీని చీట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్పైFIR నమోదు చేయాలని ఈసీని కోరామని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం తీరును కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. కేటీఆర్, కేసీఆర్ను ఢిల్లీ నుంచి కాపాడుతున్నారని AICC నేత అజయ్ ఫైరయ్యారు.
ఎన్నికల సంఘానికి టీఎన్ శేషన్ లాంటి అధికారి అవసరమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు పరిచడంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అర్హత గల ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. ఎన్నికలలో అభ్యర్థుల వ్యయంపై పరిమితి విధించారు. ఓటర్లకు లంచం లేదా భయపెట్టడం వంటి చర్యలకి అడ్డుకట్ట వేశారు. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీకి బ్రేక్ వేయగలిగారు.
ప్రచారం కోసం అధికారిక యంత్రాల వినియోగించకుండా చర్యలు చేపట్టారు శేషన్. ఓటర్లను కుల, మతపరమైన భావాలు రెచ్చగొట్టి లబ్ధి పొందకుండా.. ప్రచారానికి ప్రార్థనా స్థలాలు ఉపయోగించకుండా నిషేధం విధించారు. ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగాకి అడ్డుకట్ట వేశారు. దేశంలో ఎన్నికల సంఘాన్ని గాటినపెట్టిన వ్యక్తిగా టీఎన్ శేషన్ విశేషమైన గుర్తింపు పొందారు. పారదర్శకంగా CECని తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎనలేనిది. ఇప్పుడు కూడా అలాంటి నిష్పక్షపాత వైఖరితో ఈసీ పనిచేయాలని సూచనలు వస్తున్నాయి.
ఎన్నికల సంఘం తీరుపై అనేక విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీకి వత్తాసు పలకడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు కొత్తేమీ కాదు. గత పార్లమెంట్ ఎన్నికల ప్రకటన నుంచి అనేక నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే అధికారులు పనిచేస్తున్నారనే అపవాదు ఉంది. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ని కాపాడేలా ఢిల్లీ ఆశీస్సులు ఎన్నికల సంఘంపై పనిచేస్తున్నాయని ఫైరయ్యారు.
.
.