KCR : దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. చిత్తశుద్ధితో పనిచేస్తేనే విజయాలు సొంతమవుతాయన్నారు.
మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కేసీఆర్ టార్గెట్ చేశారు. ఈ నియోజకవర్గాన్ని భట్టి విక్రమార్క పట్టించుకోలేదన్నారు. ఆయనకు ఓటేస్తే ఇక్కడ ప్రజలకు నష్టమే జరుగుతుందని హెచ్చరించారు. చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుందని విమర్శించారు. దళితుల ఓట్లు భట్టి విక్రమార్కకు పడకూడదని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజును గెలిపిస్తే నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు ఇస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్లో డజను మంది సీఎం అభ్యర్థులున్నారని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లేనని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించబోతోందన్నారు. గతం కంటే రెండు సీట్లు ఎక్కువే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.
వైరాలోనూ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని అంటున్నారని.. ధరణి తీసేక్తే ధాన్యం కొన్న డబ్బులు ఎట్లా రావాలి? అని ప్రశ్నించారు. పోడు భూముల పంపిణీ కింద 3650 కుటుంబాలకు 7140 ఎకరాలకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. వారికి రైతుబంధు అమలు చేశామన్నారు. పోడు భూములకు సంబంధించి పోలీసు కేసులు ఎత్తివేశామని తెలిపారు.3,659 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. వైరాలో 45 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని వివరించారు.
డోర్నకల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ పాలనలో కంటి పరీక్షలు నిర్వహించామని.. 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇలా వరుస సభల్లో పాల్గొంటూ కేసీఆర్ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తూ గులాబీ బాస్ స్పీచ్ లు సాగుతున్నాయి. ఎక్కడా బీజేపీని మాత్రం ప్రస్తావించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
.
.