Moinabad : మొయినాబాద్ ప్రమాదంపై బిగ్టీవీ కథనాలతో అక్రమార్కుల్లో టెన్షన్ మొదలైంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూలిన ఘటనపై బిగ్టీవి వరస కథనాలు ప్రసారం చేయడంతో.. బిగ్టీవి ప్రతినిధులపై ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వాహకులు దౌర్జన్యం చేశారు. ఎందుకు వీడియోలు తీస్తున్నారంటూ గద్దించారు. కట్టడాలు అన్నాక కూలకుండా ఉంటాయా? అని వాగ్వాదానికి దిగారు.
ఇండోర్ స్టేడియం కూలగా.. మృతిచెందిన, గాయపడిన వారి బాధిత కుటుంబాలకు, బాధితులకు ఎలాంటి సాయం చేశారో చెప్పాలని బిగ్టీవి ప్రతినిధి ప్రశ్నిస్తే.. మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు నిర్వాహకులు. ఏమైనా కావాలంటే పోలీసులను అడుక్కోవాలంటూ దురుసుగా సమాధానమిచ్చారు. వాగ్వాదంలో మంత్రి కేటీఆర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. మొయినాబాద్ ఏరియాలో కేటీఆర్ ఎన్నో అక్రమాలు చేస్తున్నారన్న ఫైర్ఫాక్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వాహకులు.. కేటీఆర్పై కథనాలు ప్రసారం చేసే దమ్ముందా? అంటూ బిగ్ టీవీ ప్రతినిధిని ప్రశ్నించారు.
సోమవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కూలడంతో.. ఇద్దరు వలస కార్మికులు చనిపోగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు చర్యలు త్వరగా తీసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఇది హై ప్రొఫైల్ కేసు కావడమేనన్న వాదన ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఎంత త్వరగా చర్యలు తీసుకుంటారో.. కేసును ఎలా విచారణ చేస్తారో చూడాలి.