Nagarkurnool Congress Meeting : ఆదరించిన పాలమూరు జిల్లానే కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. నాగర్ కర్నూల్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ .. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పాలనలో పాలమూరులో వలసలు, ఆత్మహత్యలు ఆగలేదన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే మేజర్ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయన్నారు రేవంత్ రెడ్డి. ఆ సమయంలోనే 70 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయన్నారు. గిరిజనులు ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ స్వగ్రామం చింతమడకలోనూ రోడ్డు, గుడి, బడి నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.
పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కరీంనగర్ ప్రజలు ఓడిస్తారని భయపడి పారిపోయి పాలమూరులో కేసీఆర్ పోటీ చేశారన్నారు. తనను గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయ జీవితం కాంగ్రెస్ లో మొదలైన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. హారీష్ రావుకు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు.
ఓట్లు కొనుగోలు చేసి అందలం ఎక్కాలని కేసీఆర్ కలలు కంటున్నారని రేవంత్ ఆరోపించారు. కానీ దొరల తెలంగాణను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ పాలన మొదలవుతుందన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా రాజేష్ రెడ్డి విజయం సాధించడం ఖాయమన్నారు.
.
.