Wildlife Award Winner : లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం నిర్వహించే ఫొటోగ్రఫీ పోటీలు అంటేనే ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఏటా ఆ పోటీలకు 45 వేలకుపైగానే ఎంట్రీలు వస్తాయి. అందరినీ అధిగమించి ‘వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’కి ఎంపిక కావడమంటే ఆషామాషీ కాదు. 1964 నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఈ సారి 95 దేశాల నుంచి 49,957 ఎంట్రీలు అందాయి.
వడపోత అనంతరం ఎంపికైన విజేతల్లో ఆరుగురు ఫొటోగ్రాఫర్లు భారతీయులే. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకున్న ఆ ఆరుగురిలో పదేళ్ల విహాన్ తల్యా వికాస్ ఉండటం విశేషం. బెంగళూరుకు చెందిన అతడు ‘పదేళ్ల లోపు’ కేటగిరీలో విజేతగా నిలిచాడు. గోడపై చెక్కిన మాధవుడు.. ఆయన చేతిలో పిల్లనగ్రోవి.. ఆ పక్కనే సాలీడు.. ఇదీ విహాన్ క్లిక్మనిపించిన చిత్రం. అప్పటికి అతడు కెమెరా పట్టుకుని మూడేళ్లే అయింది.
బెంగళూరులోని కుమరన్ స్కూల్లో విహాన్ ఐదో తరగతి విద్యార్థి. ఆ ‘వండర్ ఆఫ్ వాల్’ను ఫొటో తీసేందుకు ఎంతో శ్రమపడ్డాడు. కృష్ణుడి చేతిలో ఉన్న పిల్లనగ్రోవికి దగ్గరగా ఆ సాలెపురుగు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూశాడు. అప్పటి వరకు తన గూడును అల్లుతున్న దానిని చూస్తూనే గడిపాడు. తాను అనుకున్న ‘షాట్’ రెడీ కాగానే.. క్లిక్ మనిపించాడు. దాదాపు 200 ఫొటోలు తీశాడు. వాటిలో నుంచే ‘బెస్ట్’ ఫొటో ఎంపికైంది.
ఫొటోగ్రఫీలో ఓనమాలు నేర్చుకుంటాడనే ఉద్దేశంతో విహాన్కు అతని తండ్రి తన పాత డీఎస్ఎల్ఆర్ కెమెరాను అందజేశారు. అప్పట్లో అంతకు మించి ఏమీ ఆశించలేదని చెప్పారాయన. ఫొటోలు తీయడం ద్వారా ప్రకృతిని గమనించే ఓర్పు, నేర్పు వస్తుందని భావించారు. అయితే ఆయన ఊహించిన దాని కన్నా వేగంగా విహాన్ ఫొటోగ్రఫీ మెళకువలను పట్టేయగలిగాడు.
సృజనాత్మకతను పెంపొందించే ఫొటోగ్రఫీ అంటే తనకు ఎంతో ఇష్టమని విహాన్ చెప్పాడు. కృష్ణుడిని, ఆర్నమెంటల్ ట్రీ ట్రంక్ స్పైడర్ను ఒకే ఫ్రేంలో బంధించాలనే ఆలోచన అప్పటికప్పుడు బుర్రకు తట్టిందేనని తెలిపాడు. కర్ణాటకలో వారసత్వ సంపదకు చిహ్నమైన చింతతోపును సందర్శించేందుకు ఓ సారి తండ్రితో కలిసి వెళ్లాడు విహాన్.
అక్కడి గోపాలస్వామి ఆలయంలో కృష్ణుడిని, ఆ గోడపైనే తిరుగుతున్న సాలెపురుగును గమనించాడు. అక్కడే కొద్ది సేపు ఎదురుచూసి.. తనకు కావాల్సిన ఫొటోను క్లిక్ మనిపించాడు. వేసవి సెలవులు వస్తే చాలు.. ప్రకృతిని గమనిస్తూ, జంతువులు, పురుగులను ఫొటోలు తీస్తుండటం విహాన్కు సరదా. ఖగోళ శాస్త్రమన్నా అతడికి ఇష్టమే.