Congress Meeting Wanaparthy : వనపర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు జనం పోటెత్తారు. ఈ సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల కేసీఆర్ పాలనతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వెనుబడిన పాలమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని స్పష్టం చేశారు. నిధులన్నీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే మళ్లించారని ఆరోపించారు.
ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టే స్థాయికి కేసీఆర్ దిగజారారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గద్వాల ప్రాంతానికి రైలు తెచ్చింది ఇందిరమ్మ రాజ్యమేనని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియా గాంధీ అని స్పష్టం చేశారు. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉందన్నారు. మూడోసారి కేసీఆర్ కు అవకాశం ఇస్తే మనవడిని కూడా మంత్రిని చేస్తారని తెలిపారు.
వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్ కేబినెట్ లో అత్యంత అవినీతిపరుడు నిరంజన్ రెడ్డి అని ఆరోపించారు. ఆయనకు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లున్నాయన్నారు. గుడి, బడి అని తేడా లేకుండా భూములన్నీ నిరంజన్ రెడ్డి కబ్జా చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరంజన్ రెడ్డి ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు. ఆయన కమీషన్ల నిరంజన్ రెడ్డి అని సెటైర్లు వేశారు. తెలంగాణ ఉద్యమంలో చిన్నారెడ్డి ముఖ్యపాత్ర పోషించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.