Telangana State : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు మంచి హీట్ మీద వెళుతున్నాయి. కాంగ్రెస్ లో ఎక్కడా లేని జోరు, జోష్ కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా నాయకులకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. కర్ణాటక లో వీచిన కాంగ్రెస్ గాలి అని కొందరంటుంటే, దాంతోపాటు సీఎం కేసీఆర్ చేసుకున్న స్వీయ తప్పిదాలే కారణమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
వీటన్నింటికి మించి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం వచ్చేసిందని చెబుతున్నారు. ఎక్కడికెళ్లి ఎవరిని అడిగినా… తెలంగాణ రాష్ట్రం వచ్చింది…కేసీఆర్ కుటుంబం కోసమేగానీ, ప్రజల కోసం కాదనే మాట జనాల్లోకి బాగా ఎక్కేసింది. రేపు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఇదొక అంశం ప్రతికూలంగా మారనుందని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్లయ్యింది. అంతకుముందు కేసీఆర్ ఆస్తులెంత? ఇప్పుడెంత? అని ప్రజలు ధైర్యంగా అడుగుతున్నారు. నువ్వు సంపాదించుకున్నావు సరే, మరి మాకూ ఏదొకటి చేయాలి కదా..అని రైతులు అడుగుతున్నారు.
ఇంక కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మంత్రి హరీష్ రావు వీళ్లందరి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ రోజు హైదరాబాద్ ఎలా వచ్చావు. ఈరోజెలా ఉన్నావు? అని…హరీష్ రావుని పట్టుకుని మైనంపల్లి లాంటివాళు ఊరికినే విమర్శించరు కదా అంటున్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదుగానీ, కమీషన్లు ఎక్కువ వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు, హైదరాబాద్ లో కట్టిన ఫ్లై ఓవర్లు, వంతెనలు, రాష్ట్రమంతా తవ్వి వదిలేసిన చిన్నాచితకా ప్రాజెక్టులే ఉన్నాయని అంటున్నారు. దండుకోవాల్సినంత దండుకున్నారని అంటున్నారు.
అందుకే హైదరాబాద్ లో కొత్తగా కట్టే మెట్రో కూడా కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పడం వెనుక ఇదే కారణమని విమర్శిస్తున్నారు. రూపాయి లాభం లేకుండా కేసీఆర్ కుటుంబం ఏ పనీ చేయలేదని కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్ చేసి మరీ చెబుతున్నారు.
కేసీఆర్ కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలకు పరాకాష్ట ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అంటున్నారు. మరి కేంద్రంలోని బీజేపీ తనని వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్ ని ఇరుకున పెడుతోంది, అలాగే మొన్నటి వరకు కేసీఆర్ కుమార్తె కవితక్కను ప్రశ్నించింది. రేపోమాపో అనే సమయంలో మొత్తం సీబీఐ ప్రక్రియే ఆగిపోయింది.
అప్పుడే అవినీతి లెక్కలన్నీ బయటకు వచ్చాయని అంటున్నారు. అక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి నోటీసులిస్తున్నారు గానీ, కవితక్కను ఏమీ అనడం లేదని కాంగ్రెస్ నేతలు దుయ్యబడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ-బీఆర్ఎస్ కలిసిపోయాయని, దొంగా పోలీస్ ఆట ఆడుతున్నాయని, ప్రజలు నమ్మవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లిన చోటల్లా చెబుతున్నారు.
ఇంక కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి మొదలుపెడితే, మంత్రి కేటీఆర్ బినామీలతో చేసే రియల్ ఎస్టేట్ దందాలన్నీ రేపు అధికారంలోకి వచ్చాక బయటకు తెస్తామని రేవంత్ రెడ్డి తొడకొట్టి మరీ చెబుతున్నారు.
మొత్తానికి ప్రజలకు మాత్రం ఒకటి అర్థమైంది. తెలంగాణ వచ్చింది తమ కోసం కాదు..కేసీఆర్ కుటుంబం కోసం అని..అది పబ్లిక్ మనసుల్లో బాగా నాటుకుపోయింది. ఈ విషయం తెలిసే సీఎం కేసీఆర్ ప్రస్తుతం తలపట్టుకున్నట్టు సమాచారం.