P.Vijaya Reddy : ఖైరతాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. పీజేఆర్ కుటుంబానికి కేరాఫ్ అడ్రస్. పీజేఆర్ మరణం తర్వాత ఇక్కడ నుంచి ఉపఎన్నికలో ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. కానీ 2009 ఎన్నికల నుంచి ఇక్కడ ఆ కుటుంబానికి ప్రాతినిధ్యం లేదు. ఈ ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబం నుంచి ఆయన కుమార్తె విజయారెడ్డి బరిలోకి దిగారు . గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏ బస్తీలో చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని విజయారెడ్డి అంటున్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ నియోజకవర్గంలో విద్య , వైద్యసదుపాయాలు లేని పరిస్థితి ఉందన్నారు. 10 ఏళ్ల BRS పాలనలో నియోజకవర్గం అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. తనను గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు.
PJR ఆశయాలు సాకారం అవ్వాలంటే ఖైరతాబాద్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజయారెడ్డి పిలుపునిచ్చారు. PJR బస్తీ ప్రజల గుండెల్లో ఉన్నారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు అభిమానంతో అందరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గం ఇది అని పేర్కొన్నారు. భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని స్పష్టం చేశారు.