Bangladesh Dengue Fever : పెరుగుతున్న డెంగ్యూ కేసులతో బంగ్లాదేశ్ గజగజ వణుకుతోంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ వైరస్ వ్యాప్తికి కారణమైన ఏడిస్ ఈజిప్టై దోమలను అరికట్టడంలో అధికార యంత్రాంగం వైఫల్యం తాజా దుస్థితికి దారితీసింది. డెంగ్యూ జ్వరంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1549 మంది మరణించారు. గత ఏడాదితో పోలిస్తే మరణాల సంఖ్య 5 రెట్లకు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
రుతుపవన సీజన్ సుదీర్ఘకాలం కొనసాగడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి కారణాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఆదివారం ఒక్క రోజే 1291 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో 4949 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశంలోని 64 జిల్లాల్లో డెంగ్యూ వ్యాధి ప్రబలడం ఇదే తొలిసారి. జనసాంద్రత అధికంగా గల ఈ దేశంలోని ఆస్పత్రులు ఇప్పుడు డెంగ్యూ రోగులతో నిండిపోయాయి.
డెంగ్యూ వ్యాధి ఇంతగా ప్రబలడం గతంలో ఎన్నడూ జరగలేదని ఎంటమాలజిస్ట్ కబీరుల్ బషర్ చెప్పారు.
దక్షిణాసియాలో జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య డెంగ్యూ కేసులు ప్రబలడం సర్వసాధారణం. కానీ దేశంలో ఇప్పుడు ఏడాది పొడవునా డెంగ్యూ కేసులు
నమోదవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
డెంగ్యూ బారిన పడినప్పటికీ.. ఆ లక్షణాలేవీ కనిపించడం లేదని చెబుతున్నారు. సో.. వాస్తవ గణాంకాలు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సారి డెంగ్యూ బారిన పడిన వారిలో కొంచెం భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. తమ దగ్గరకు వస్తున్న రోగుల్లో దగ్గు మాత్రమే ఉంటోందని తెలిపారు.
డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్ కానీ, సరైన ఔషధం కానీ లేదు. అయితే ముందుగానే గుర్తించగలిగితే ఈ వైరస్ సోకిన వారిలో మరణాలను ఒక శాతానికి పరిమితం చేయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.