Football Match : సొంతగడ్డపై సమష్టి ఆటతీరుతో రాణించి ఆసియా చాంపియన్ ఖతర్ జట్టును నిలువరించాలని పట్టుదలతో ఉంది భారత పురుషుల ఫుట్బాల్ జట్టు. ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ రెండో రౌండ్లో భాగంగా ఇవాళ కళింగ స్టేడియంలో ఖతర్ జట్టుతో తలపడనుంది భారత్. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 61వ స్థానంలో ఖతర్, 102వ స్థానంలో భారత్ ఉంది. ర్యాంక్ పరంగానూ, ప్రావీణ్యం పరంగానూ మెరుగ్గా ఉన్న ఖతర్ జట్టును నిలువరించాలంటే భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సిందే.
ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీని సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు విజయంతో ప్రారంభించింది . కువైట్తో ఈనెల 16న జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో 1–0తో గెలిచింది భారత్. మరోవైపు ఖతర్ జట్టు తొలి లీగ్ మ్యాచ్ లో 8-1తో ఆఫ్ఘనిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్ భారతజట్టు సత్తాకు సవాల్గా నిలువనుంది. ఇప్పటి వరకూ భారత్, ఖతర్ జట్లు ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి.
1996లో ఖతర్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 0-6తో ఓడిన టీమిండియా.. 2019లో రెండో మ్యాచ్ ను 0-0తో డ్రా చేసుకుంది. 2021లో జరిగిన మూడో మ్యాచ్లో 0–1తో భారత్ ఓటమి చవిచూసింది. ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్ గ్రూప్ Aలో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ఇంటా బయటా పద్ధతిలో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో మొత్తం 6 మ్యాచ్ లు ఆడుతుంది. అనంతరం టాప్–2లో నిలిచిన రెండు జట్లు ప్రపంచకప్ మూడో రౌండ్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధిస్తాయి.
.
.