Congress Meeting Narsapur : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరుస సభల్లో పాల్గొంటున్నారు. నర్సాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో బీఆర్ఎస్ సర్కార్ పై రేవంత్ ఫైర్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. అప్పుడు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంపిణీ చేశారని వివరించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చెప్పకుండా కేసీఆర్ కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ ప్రజలను , ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నర్సాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు నమ్మకం ద్రోహం చేసిన వారిని ఓడించాలని కోరారు. ఈ ప్రాంతంలో లంబాడీ తాండాల అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. లంబాడీలకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారం తెలంగాణ కాలేదన్నారు రేవంత్ రెడ్డి. బెల్టు షాపుల తెలంగాణగా మారిందని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగంలో నెంబర్ వన్ గా మారిందన్నారు. కానీ కేసీఆర్ కుటుంబానికి పదవులు వచ్చాయన్నారు. కల్వకుంట్ల కుటుంబమే బంగారు పల్లెంలో తింటోందని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ ను బొంద పెట్టే టైమ్ వచ్చిందన్నారు. కేసీఆర్ కు కాలం చెల్లిపోయిందని స్పష్టం చేశారు. గులాబీ బాస్ ను ఫామ్ హౌస్ కు పంపిద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
.
.