Bethavolu canal: నాగార్జున సాగర్ ఎడమ కాలువపై నిర్మించిన బేతవోలు వరద కాలువ ఎస్కేప్ షట్టర్ ఊడిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో ఆదివారం అర్థరాత్రి జరిగింది. షట్టర్ ఊడిపోవడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న పొలాలన్నీ నీట మునిగాయి. కోత కోసిన పంట కల్లాల్లోనే ఉండటంతో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన మునగాల మండల పరిధిలోని రైతులకు అపార నష్టం కలిగించింది.
ఈ తెల్లవారుజామున నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు, సూపరిండెంట్ ఇంజనీర్ నరసింహ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వరద కాలువకు నీటి సరఫరా ఆపేశారు. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగింది. బేతవోలు చెరువును నింపేందుకే జేసీబీతో షట్టర్ తెరిచినట్లు చిలుకూరు మండల పరిధిలోని పోలేనిగూడెం రైతులు ఆరోపిస్తున్నారు. ఇది కుట్రలో భాగంగానే జరిగిందని రైతులు ఆందోళన చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తే నీటిపాలయ్యిందని.. షట్టర్ తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేసారు.