sickle cell : సికిల్ సెల్ ఎనీమియాకు జీన్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. క్రిస్ప్ఆర్ జన్యు ఎడిటింగ్ టూల్ ద్వారా ఈ వ్యాధిని నయం చేసేందుకు బ్రిటన్ అనుమతించింది. సికిల్ సెల్కు ఇలా జీన్ థెరపీని అనుమతించిన తొలి దేశం ప్రపంచంలో అదే. 2 కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో విలవిలాడుతున్నారు. దీని బారిన పడితే నిత్యం నరకమే. ఇప్పటివరకు దీనికి చికిత్స లేదు. జీన్ థెరపీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమే అయినా.. నిత్య నరకం నుంచి బాధితులు విముక్తులు కాగలుగుతారు.
ఏటా 3 లక్షల మంది..
భారత్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో ఈ తరహా రక్తహీనత సర్వసాధారణం. మన దేశంతో పాటు నైజీరియా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కేసులు అత్యధికం. ఏటా 3 లక్షల మంది సికిల్ సెల్ రక్తహీనతతో జన్మిస్తున్నారని అంచనా. 2050 నాటికి ఈ సంఖ్య 4 లక్షలు దాటుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రక్తహీనత కారణంగానే మన దేశంలో బాలింత మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
షికాగోలో 110 ఏళ్ల క్రితమే..
110 ఏళ్ల క్రితమే సికిల్ సెల్ వ్యాధి వెలుగుచూసింది. షికాగోలో వెస్టిండియన్ విద్యార్థి ఒకరు దీని బారిన పడ్డారు. మలేరియా విస్తృతంగా ప్రబలిన ప్రాంతాలకు చెందిన పూర్వీకుల నుంచి సికిల్ సెల్ వ్యాధి వంశానుగతంగా పాకుతోంది. సికిల్ సెల్ అనేది జన్యు సంబంధిత వ్యాధి. వంశానుగతంగా వచ్చే రక్త రుగ్మత. ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 10 లక్షల మంది గిరిజనుల్లో పదిశాతం మందిలో సికిల్ సెల్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. రక్త, జన్యు పరీక్షల ద్వారా ఈ వ్యాధి సోకిందీ, లేనిదీ నిర్ధారిస్తారు. అమెరికాలో శిశువు పుట్టిన వెంటనే రోటీన్ స్ర్కీనింగ్లో భాగంగా సికిల్ సెల్ నిర్ధారణ పరీక్షలు చేస్తారు.
86 మందిలో ఒకరు..
దేశంలో.. ముఖ్యంగా గిరిజన జనాభాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్టీల్లో ప్రతి 86 జననాల్లో ఒకరు ఈ వ్యాధితో పుడుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో ఎర్ర రక్తకణాలు అసాధారణ మార్పులకు లోనవుతాయి. జన్యుసంబంధ మార్పుల వల్ల గట్టిపడటమే కాకుండా జిగటగా మారతాయి. సికిల్(కొడవలి) లేదా C ఆకారాన్ని సంతరించుకుంటాయి. ఈ ఎనీమియాతో బాధపడేవారిలో ఆరోగ్యవంతమైన ఎర్రరక్త కణాలు ఉండవు. ఆ కణాల ద్వారా తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో.. రక్తం సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది.
జీవిత కాలం 10-20 రోజులే
సాధారణ పరిస్థితుల్లో రక్త కణాల జీవితకాలం 120 రోజులు. కానీ సికిల్ సెల్ కణాల జీవితకాలం మాత్రం 10-20 రోజులే. సికిల్ సెల్ కణాలు నశిస్తున్నంత వేతంగా ఎర్రకణాల ఉత్పత్తి జరగకపోవడంతో రక్తహీనతకు గురవుతారు. దీంతో త్వరితంగా అలసిపోతారు. తరచూ నొప్పులు బాధపెడుతుంటాయి. ఛాతీ, పొత్తికడుపు, జాయింట్ల వద్ద నొప్పి ఎక్కువగా వస్తూ పోతుంటుంది. ఆ నొప్పి గంటలు లేదా కొన్ని రోజుల పాటు ఉండొచ్చు. చేతులు, కాళ్లలో వాపు కనిపిస్తుంది. సికిల్ సెల్స్ వల్ల స్ల్పీన్ పనితీరు మందగించి.. ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తకణంలో ఒక సికిల్ సెల్, మరొకటి మామూలుగా ఉన్న వారిని సికిల్ సెల్ క్యారియర్లు అని పిలుస్తారు. వీళ్లకి సాధారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఉండవు. అయితే ఇలా ఉన్న వారు దంపతులైన పక్షంలో వారి పిల్లలు సికిల్ సెల్స్తోనే జన్మిస్తారు.
కేంద్రం చర్యలు
సికిల్ సెల్ ఎనీమియా నుంచి ప్రజలను విముక్తం చేయాలని కేంద్రం సంకల్పించింది. ఈ వ్యాధిని 2047 నాటికి నిర్మూలించే దిశగా మిషన్ను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో 0-40 ఏళ్ల లోపు వయసున్న 7 కోట్ల మందికి స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది.
రాష్ట్రాల్లో అక్కడక్కడా..
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వ్యాధి నివారణకు ఇప్పటికే ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ప్రత్యేకంగా సికిల్ సెల్ ఇన్స్టిట్యూట్నే నెలకొల్పి 12.43 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిపారు. సికిల్ సెల్ అనీమియా కట్టడిలో గుజరాత్ ఆదర్శంగా నిలుస్తోంది. 2008లో అక్కడి ప్రభుత్వం గిరిజనులు అధికంగా ఉండే 12 జిల్లాల్లో సికిల్ సెల్ అనీమియా నియంత్రణ ప్రాజెక్టు చేపట్టింది. 18.28 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిపి జబ్బుతో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించి, సికిల్ సెల్ క్యారియర్ల మధ్య వివాహాలు జరగకుండా వారిని చైతన్యపరిచింది. తాజాగా మధ్యప్రదేశ్ సర్కారు కూడా కీలక ఆదేశాలిచ్చింది. గిరిజనుల అత్యధికంగా ఉన్న 20 జిల్లాల్లో నవజాత శిశువులకు సికిల్ సెల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. రక్త పరీక్షల కోసం భోపాల్లోని ఎయిమ్స్ కేంద్రంలో ప్రత్యేకంగా ల్యాబ్ నే నెలకొల్పారు.
జీన్ థెరపీ ఇలా..
జీన్ థెరపీలో భాగంగా కేస్గెవీ అనే కొత్త ఔషధం.. లోపమున్న జన్యువుపై పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ సరిగ్గా ఉత్పత్తయ్యేలా అది చూస్తుంది. బాధితులకు తొలుత కీమోథెరపీ చికిత్స ఉంటుంది. అలాగే రోగి ఎముక మజ్జ నుంచి మూలకణాలను సేకరిస్తారు. వాటిలో లోపమున్న జన్యువును క్రిస్ప్ఆర్(CRISPR) టూల్ ద్వారా సరిచేస్తారు. సికిల్ సెల్కు శాశ్వత పరిష్కారంగా ఆ కణాలను తిరిగి శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇలా మూల కణాలను సేకరించి.. జన్యువులను సరిచేసి.. తిరిగి శరీరంలోకి వాటిని పంపేందుకు రోగి కనీసం రెండు పర్యాయాలైనా ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది. అమెరికా కూడా బ్రిటన్ బాటనే అనుసరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కేస్గెవీ ఔషధం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరిశీలనలో ఉంది. వచ్చే నెలలో ఆమోదం లభించే అవకాశాలున్నాయి.