Revanth Reddy : ఒక వైపు తన నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ.. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రోజుకి 3 నియోజకవర్గాలకు తగ్గకుండా చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. ఒక వైపు ఆ పార్టీకి పాజిటివ్ వేవ్స్ కనిపిస్తున్నాయి. కచ్చితంగా కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కుతుందనే కాన్ఫిడెన్స్లో ఉన్నామని హస్తం నేతలు అంటున్నారు.
ఇదే క్రమంలో నిన్న మీట్ ది ప్రెస్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణలో 80 నుండి 85 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ప్రకటించారు. రాష్ట్రంలో తమకు సంపూర్ణ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడం కాంగ్రెస్ విధానమన్నారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ను అంబేద్కర్ భవన్గా మారుస్తామన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తెలంగాణ ప్రజలు ప్రపంచంతో పోటీ పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ లా ఉన్నవాటిని కూల్చి కొత్తవాటిని కట్టే విధానాలకు కాంగ్రెస్ స్వస్తి పలుకుతుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కక్షపూరిత ధోరణితో ఏనాడు వ్యవహరించలేదన్నారు.
నక్సలైట్ల ఎజెండాను అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందన్నారు.కాంగ్రెస్ పాలనలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో ఉన్నట్టుగా నిర్బంధాలు ఉండవన్నారు. కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డు ఇచ్చి ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
భూ యాజమానికి, కౌలు రైతులకు, రైతు కూలీలకు అందరికీ ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఇందులో గందరగోళం ఏమీ లేదని.. బీఆర్ఎస్ గందరగోళం సృష్టించాలని చూస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
బీసీ గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా, బీజేపీ పట్టించుకోలేదని, అలాంటి పార్టీ బీసీని ఎలా సీఎం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కోసమే ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చిందని, ఎన్నికలయ్యాక అసలు ఆ విషయమే బీజేపీ పట్టించుకోదని మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కాగా, ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవుతాయంటూ జోస్యం చెప్పారు. అసలు డిపాజిట్లే రాని పార్టీ బీసీని ఎలా ముఖ్యమంత్రిని చేస్తుందంటూ ఎద్దేవా చేశారు.
.
.
.