Icc Worldcup 2023 : వన్డే వరల్డ్ కప్ 2023లో మొదటి మ్యాచ్ నుంచి సెమీస్ వరకు అద్భుతంగా ఆడి, సరిగ్గా ఆడాల్సిన ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా చేతులెత్తేసింది. మొదట టాస్ ఓడిన దగ్గర నుంచి టీమ్ ఇండియాను దురదృష్టం వెంటాడుతూనే కనిపించింది.
ఫస్ బ్యాటింగ్ చేసిన వారికి బాగుంటుందని చెప్పిన క్యూరేటర్ ని అందరూ తిట్టిపోస్టున్నారు. ఆ మాటే నిజమనుకుని టాస్ ఓడినా బ్యాటింగ్ వచ్చేసరికి అందరూ ఆనందపడ్డారు. కానీ అదెంత పెద్ద పొరపాటో మనవాళ్లు ఆడుతున్నప్పుడు అర్థమైంది. ఒకరకంగా చెప్పాలంటే టాస్ టీమ్ ఇండియా పాలిట శాపంగా మారింది. సెకండ్ బ్యాటింగ్ టైమ్ కి అది బ్యాటర్లకి స్వర్గధామంలా మారిపోయింది.
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో పడుతూ లేస్తూ 240 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసి ఘన విజయం సాధించి ఆరోసారి ప్రపంచ కప్ ని ఎగరేసుకు పోయింది.
టీమ్ ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించి.. త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయింది, రోహిత్ శర్మ ఎప్పటిలా ఎటాకింగ్ ప్లే ఆడి 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
కుర్రాళ్లు ఇద్దరూ ఆడుతారని అనుకుంటే శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ చెరో నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యారు.
బ్యాటింగ్ కి అత్యంత కఠినంగా మారిన పిచ్ పై కొహ్లీ, రాహుల్ పడుతూ లేస్తూ ఒకొక్క పరుగు అతికష్టమ్మీద తీస్తూ ఆడారు. సరైన సమయంలో కొహ్లీ (54) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత రాహుల్ ఒంటరిపోరాటం (66) చేసి అవుట్ అయిపోయాడు.
సూర్యకుమార్ (18) ఇరగదీస్తాడని అనుకుంటే తను తేలిపోయాడు. అసలు వరల్డ్ కప్ లో తనెందుకు ఉన్నాడో కూడా తెలియని స్థితిలో అతని ఆట తీరు సాగింది. జడేజా (9), షమీ (6), కులదీప్ (10) సిరాజ్ (9) ఇలా తలా కొంత చేసి చివరికి 240 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బౌలింగ్ లో స్టార్క్ 3, హేజిల్ వుడ్ 2, కమిన్స్ 2, మాక్స్ వెల్ 1, జంపా 1 వికెట్ తీసుకున్నారు.
తర్వాత 241 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు మొదటి ఓవర్ లోనే బూమ్రాని ఆడుకున్నారు. 15 పరుగులు వచ్చాయి. తర్వాత షమీ వచ్చి మొదటి ఓవర్ లోనే వార్నర్ (7) వికెట్ తీసుకున్నాడు. తర్వాత బుమ్రా వరుస ఓవర్లలో రెడు మార్ష్ (15), స్మిత్ (4) వికెట్లను తీసుకున్నాడు.
47 పరుగులకి 3 వికెట్లతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆస్ట్రేలియాను ట్రావిస్ హెడ్ ఆదుకున్నాడు. ఆనాడు 2003లో రికీ పాంటింగ్ 140 పరుగులు చేసినట్టు ఈరోజున 137 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. తనకి లబూషేన్ (58) అండగా నిలిచాడు. మొత్తానికి ఫైనల్ లో ఇండియా మరోసారి నిరాశపరిచింది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను అడియాశలు చేసింది.
అయితే ఒకవిధంగా టీమ్ ఇండియాని మెచ్చుకోవచ్చు. పదికి పది మ్యాచ్ లు వరుసగా గెలిచారు. అందుకు మనవాళ్లని అభినందించాలి. చివరలో ఆడాల్సిన నాకౌట్ మ్యాచ్ లో ఓటమి పాలయ్యారు. అలాగని మనవాళ్ల కష్టాన్ని తక్కువ చేయడం, చులకన చేయడం తగదు. అలా అనుకుంటే అన్యాయమే అవుతుంది. ఈ టైమ్ లో భారతీయులందరూ మన టీమ్ ఇండియాకి అండగా నిలబడాలి.
ఇండియా బౌలింగ్ లో బుమ్రాకి 2 వికెట్లు, షమీకి 1, సిరాజ్ కి 1 వికెట్ దక్కింది.
ఒక టైమ్ లో అదృష్టం టీమ్ ఇండియా వైపు వచ్చింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయగానే త్వరగానే 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత దానిని కొనసాగించలేకపోయారు. అరవీర భయంకరులుగా కనిపించిన పేస్ త్రయం చివరి మ్యాచ్ లో చేతులెత్తేసింది. ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ ని తీసుకోవడం వ్యూహాత్మక తప్పిదమే అయ్యింది. అతని బదులు అశ్విన్ ని తీసుకుని ఉండి ఉంటే, ఫలితం మరోలా ఉండేదేమో.. ఏది ఏమైనా టీమ్ ఇండియా అద్భుతంగా ఆడారు. కానీ చివరి మ్యాచ్ లో కలిసి రాలేదు. అంతే అని అనుకోవాలి.