రాజకీయాలు అందరికి అచ్చిరావు. కొందరికి ఎంత ప్రయత్నించినా విజయం లభించదు. ఇక సాధారణ ప్రజలు రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించరు. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారైతే రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. ఉద్యోగాలు వదిలి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనే మానుకుంటారు. కాని ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు కొలువులను వదిలి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చుకున్నారు. వారే మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్, జుక్కల్ ప్రస్తుత ఎమ్మెల్యే హన్మంత్షిండే, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డిలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా 38 ఏళ్ల రాజకీయ ప్రయాణం సాగించిన ధర్మపురి శ్రీనివాస్(డీ.ఎస్) రాజకీయాల్లోకి రాకముందు రిజర్వ్ బ్యాంక్లో పదేళ్లపాటు(1974-84) ఉద్యోగం చేశారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడినా.. 1989 తర్వాతి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నాటి నేత అర్గుల్ రాజారాం ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు.
జుక్కల్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన హన్మంత్షిండే 2004కి ముందు కౌలాస్నాలా ప్రాజెక్టులో ఇంజినీరుగా పనిచేసేవారు. 2004లో టీడీపీ తరపున జుక్కల్ నుంచి పోటీచేసి స్వల్పతేడాలో ఓడినా, 2009,2014, 2018లో గెలిచారు. మరోసారి బరిలో నిలిచారు.
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఏనుగు రవీందర్రెడ్డి గతంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం కోసం కొలువుకు రాజీనామా చేసి.. 2004లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో తలపడుతున్నారు.