Deep Fake Video : అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ.. మనిషి అభివృద్ధికి కాకుండా.. ఎదుటివారిని కుంగదీసేందుకు వాడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలే ఇందుకు నిదర్శనం. సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవ్వగా.. వాటిపై కేంద్రం సీరియస్ అయిన విషయం తెలిసిందే. యావత్ దేశాన్నీ ఇవి కలవరపాటుకు గురిచేశాయి. ఏఐ (కృత్రిమ మేధ)ను దుర్వినియోగం చేసి.. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలను సృష్టించడం ఆందోళనకరమైన విషయమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తాజాగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. ఈ అంశంపై స్పందించిన ఆయన.. ఆందోళన వ్యక్తం చేశారు.
డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకే పెనుముప్పుగా మారుతున్నాయని, సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఏకంగా తానే పాటపాడినట్లు ఒక వీడియో వైరల్ అవ్వగా.. దానిని తనకు తెలిసినవారు పంపారన్నారు. ఇలాంటి ఫేక్, డీప్ ఫేక్ వీడియోలపై ప్రజలకు.. మీడియా, జర్నలిస్టులు అవగాహన కల్పించాలని ప్రధాని సూచించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల లాభాలకంటే.. నష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే వాటిని ఫ్లాగ్ చేసి వార్నింగ్ ఇవ్వాల్సిందిగా చాట్ జీపీటీ టీమ్ ను కోరినట్లు ప్రధాని తెలిపారు. కాగా.. ఇటీవల రష్మిక, కత్రినా, కాజోల్ ల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవ్వగా.. వాటిపై కేంద్రం సీరియస్ అయింది. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ఫిర్యాదులు అందిన 36 గంటల్లోగా వాటిని తొలగించాలని అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఆదేశించింది. ఇలాంటి పనులకు పాల్పడిన వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలుశిక్ష, లక్షరూపాయల జరిమానా పడుతుందని హెచ్చరించింది.