Supreme Court : తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి సుప్రీంలో సవాల్ చేశారు. పిటిషన్ను సీజేఐ ధర్మాసనం ఎదుట నిందితుల తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. శుక్రవారం చేపట్టే కేసుల విచారణ జాబితాలో ఈ పిటిషన్ ను చేర్చాలని రిజిస్ట్రీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
హైదరాబాద్ లోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్రెడ్డిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ముగ్గురు నిందితులు ఆరోపణలు ఎదురొంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే నిందితుల రిమాండ్ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు.. నిందితుల రిమాండ్కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.