Telangana Elections : భువనగిరి పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంటే. గత రెండు దఫాలుగా ఈ సెగ్మెంట్లో తిరుగులేని విజయాలు సాధిస్తున్న బీఆర్ఎస్కు ఎన్నికల ముందు భారీ షాక్లే తగులుతున్నాయి. ఓవైపు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి గ్రౌండ్ లో నిరసన వ్యక్తం అవుతుండగా.. బీఆర్ఎస్లో అసంతృప్తులు మరో టెన్షన్ గా మారాయి. ఇంకోవైపు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కారెక్కినట్లే ఎక్కి దిగడంతో భువనగిరి గులాబీ శ్రేణులు కన్ఫ్యూజన్ లో పడిపోయాయంటున్నారు.
భువనగిరి బీఆర్ఎస్లో అసమ్మతి సెగ రాజుకుంది. బీఆరెస్ రెబల్గా బరిలో నిలవాలని దివంగత కొనపురి రాములు సతీమణి కవిత నిర్ణయం తీసుకోవడంతో బీఆరెస్ శ్రేణులలో గందరగోళం నెలకొంది. పైళ్లకు నియోజకవర్గంలో అడుగడుగునా అసమ్మతి సెగలు తగులుతుండగా, కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలతో క్రమక్రమంగా కుంభం గ్రాఫ్ మరింత పెరుగుతోంది. పోలింగ్ టైం దగ్గర పడేకొద్దీ భువనగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ కు ముందు బీఆర్ఎస్ జోరు స్పష్టంగా కనిపించింది. భువనగిరిలో ఇద్దరు నేతలే కీలకం. అందులో ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. ఇంకొకరు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న కుంభం షెడ్యూల్ కు ముందు ప్రగతి భవన్ వెళ్లి గులాబీ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు డీలా పడ్డాయి. అయితే మళ్లీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పైగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇంటింటికి తీసుకెళ్తుండడంతో జనం నుంచి మంచి స్పందన వస్తుందంటున్నారు. కుంభం అనిల్ సతీమణి, కూతురు, కుమారుడు సైతం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు బాగా పుంజుకున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు భువనగిరి నియోజకవర్గంలో పైళ్ల, కుంభం మధ్య నువ్వా-నేనా అనే రీతిలో ఉన్న పోరు ఇప్పుడు కుంభందే పైచేయిగా మారిందా అన్నట్లుగా పరిణామాలు మారిపోయాయి.
భువనగిరి నియోజకవర్గంలో రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన పైళ్ల శేఖర్ రెడ్డికి ఈసారి ఎదురుగాలి వీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయనపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి పెరగడంతో బీఆరెస్ క్యాడర్లో కొంత అలజడి మొదలయింది. మాజీ మావోయిస్టు దివంగత బీఆర్ఎస్ నేత కొనపూరి రాములు భార్య కొనపురి కవిత భువనగిరి అసెంబ్లీ ఎన్నికలలో బరిలో బీసీ సామాజికవర్గం తరపున బీఆరెస్ రెబల్ గా నిలుస్తున్నానని ప్రకటించడంతో భువనగిరి నియోజకవర్గ బీఆరెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. వలిగొండ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్గా పనిచేసిన ఆమెకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. గత కొన్ని నెలలుగా కొనపురి కవిత అధికార పార్టీకి, ఇటు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో దూరంగా ఉంటూ, నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలను, బీసీలను కలుపుకొని ఈసారి ఎన్నికలలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని కొంత మంది ముఖ్య నేతలతో ఆమె భువనగిరిలో రహస్య సమావేశం నిర్వహించారు. ఉద్యమకారులు, అమరుల కుటుంబాల ప్రోత్సాహంతో బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు పైళ్ల ప్రచారంలో ఆయన సొంత క్యాడర్ సైతం పాల్గొనడం లేదు. దీంతో బిఆర్ఎస్ శిబిరంలో అలజడి కనిపిస్తోంది.