New Zealand vs Srilanka : న్యూజిలాండ్ కు చివరి మ్యాచ్. ఒకవైపు వర్షం భయం, 401 పరుగులు చేసి కూడా ఓడిపోయిన దౌర్భాగ్యం…ఇన్ని ప్రతికూలతల మధ్య కివీస్ అటు శ్రీలంకతోనూ, ఇటు పరిస్థితులతోనూ పోరాడి అనుకున్న విజయం సాధించింది. శ్రీలంక ఇంటి దారి పట్టింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్- శ్రీలంక మద్య జరిగిన మ్యాచ్ అంతా ఏకపక్షంగా సాగిపోయింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అయితే 23.2 ఓవర్లలోనే కివీస్ 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.
171 పరుగుల లక్ష్యసాధనలో కివీస్ చాలా వ్యూహాత్మకంగా బ్యాటింగ్ చేసింది. మరోవైపు పాకిస్తాన్కు సెమీస్ ఆశలను కఠినం చేస్తూ మ్యాచ్ను ఫినిష్ చేసింది. కివీస్ ఓపెనర్లు డేవన్ కాన్వే (45), రచిన్ రవీంద్ర (42) ఇద్దరూ జాగ్రత్తగా ఆడారు. కాకపోతే ఇద్దరు రెండు పరుగుల తేడాతో అవుట్ అయిపోయారు. అప్పటికి 13.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కివీస్ 88 పరుగులతో ఉంది.
ఫస్ట్ డౌన్ వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (14) కీలక సమయంలో నిరాశపరిచాడు. అయితే డేరిల్ మిచెల్ (43) ఆదుకున్నాడు. తర్వాత మార్క్ చాప్మెన్ (7), గ్లెన్ ఫిలిప్స్ (17), టామ్ లాథమ్ (2) కలిసి 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి జట్టుని విజయ తీరాలకు చేర్చారు. సెమీస్ ముంగిటకు చేర్చారు.
శ్రీలంక బౌలింగ్లో ఏంజిలో మాథ్యూస్ 2, చమీరా 1, తీక్షణ 1 వికెట్లు తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మానసికంగా బాగా కుంగిపోయినట్టు కనిపించింది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో తనకి కూడా చావో రేవో అన్నమాట. గెలిస్తేనే పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి చేరుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా క్వాలిఫై అవుతుంది. అక్కడ కివీస్కు అదే పరిస్థితి. గెలిస్తేనే సెమీస్కి వెళుతుంది. ఈ ఒత్తిడిలో శ్రీలంక బ్యాటర్లు స్పీడ్ గా ఆడదామని ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు.
ఓపెనర్ నిస్సాంక (2) రెండో ఓవర్ లోనే వెనుతిరిగాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా (51) మాత్రం జాగర్తగా ఆడి ఆఫ్ సెంచరీ చేశాడు. కానీ తనకి సహచరులెవ్వరూ సరైన భాగస్వామ్యాన్ని నెలకొల్పే అవకాశాన్ని ఇవ్వలేదు. తను ఒక ఎండ్ లో అలాగే ఉన్నాడు. అందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
కెప్టెన్ కుశాల్ మెండిస్ (6), సమరవిక్రమ (1), అసలంక (8), ఏంజిలో మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వా (19), కరుణరత్నే (6), మహేష్ తీక్షణ (38 నాటౌట్ ), దిల్షాన్ మధుశంక (19), చమీరా (1) ఇలా పరుగులు చేశారు. చివరికి 46.4 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేయగలిగారు. చివరికెన్నో వివాదాల మధ్య శ్రీలంక ఇంటి దారి పట్టింది.
కివీస్ బౌలింగ్ లో బౌల్ట్ 3, టిమ్ సౌథీ 1, ఫెర్గ్యూసన్ 2, మిచెల్ శాంట్నర్ 2, రచిన్ రవీంద్ర 2 వికెట్లు తీశారు.