Congress Final List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఐదుగురు సభ్యులతో తుది జాబితా విడుదల చేసింది. మొదటి మూడు జాబితాలో 114 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. తుది జాబితాలో అధిష్ఠానం పటాన్చెరు నియోజకవర్గంలో అనూహ్య మార్పు చేసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్కు పటాన్చెరు స్థానాన్ని కేటాయిస్తున్నట్లు ముందుగా ప్రకటించింది. కాగా తుది జాబితాలో ఆ స్థానాన్ని కాటా శ్రీనివాస్ గౌడ్ కు కేటాయించింది. ఇక సిపిఎంతో పొత్తు ఉంటుందని.. మిర్యాలగూడ స్థాన్నాన్ని వారికి కేటాయిస్తారని అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ చివరకు ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ బత్తుల లక్ష్మారెడ్డి కు కేటాయించింది.
ఇక సూర్యాపేట స్థానానికి పటేల్ రమేష్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఈ సీటు ప్రకటన కాంగ్రెస్ పార్టీకి పెను సవాల్ గా మారింది. చివరకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి బరిలో ఉండనున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది.ఎస్సీ రిజర్వుడు స్థానం అయిన తుంగతుర్తి నియోజకవర్గంలో తీవ్ర పోటీ నెలకొంది. అద్దంకి దయాకర్.. మందుల సామేల్.. పిడమర్తి రవి.. మోత్కుపల్లి నర్సింహులు ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి. కానీ చివరకు మందుల సామేల్కే అధిష్ఠానం ఆ సీటును కేటాయించింది. ఇక చార్మినార్ నుంచి ముజీబ్ ఉల్లా షరీఫ్ బరిలో దిగనున్నారు.