Revanth Reddy: పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు టార్గెట్ గా రేవంత్ విమర్శలు గుప్పించారు. 2018లోనే ఆయనను ఓడించాలనుకున్నానని కానీ ఆ రోజు గురి తప్పిందన్నారు. ఈరోజు ఈ జనాన్ని చూసి తర్వాత ఎర్రబెల్లిని ఓడిస్తారన్న నమ్మకం కలిగిందన్నారు. పాలకుర్తికి ఎంతో చరిత్ర ఉందన్నారు. ఈ గడ్డ నుంచి దొరల పెత్తనంపై ఉద్యమించిన చాకల ఐలమ్మ స్పూర్తి ఉందన్నారు. దొరల గడీలు బద్దల కొట్టడానికి ప్రజల సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
40 ఏళ్ల క్రితం రేషన్ డీలర్ గా ఉన్న దయాకరరావు ..డాలర్ దయాకర్ రావుకు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారని రేవంత్ ప్రశ్నించారు. 5 ఏళ్లుగా పంచాయతీ రాజ్ మంత్రి ఉండి.. సర్పంచ్ ల సమస్య పరిష్కరించారా అని నిలదీశారు. 360 కోట్లతో చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా వ్యయ అంచనాలు 700 కోట్లుకు పెంచి 250 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.
రాజేందర్ రెడ్డి కుటుంబం గురించి రేవంత్ వివరించారు. ఆ కుటుంబ పాలకుర్తిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. దాన ధర్మాలు చేశారని వివరించారు. దయాకర్ రావు వారిని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఝాన్సీరెడ్డి పాలకుర్తిలో పోటీ చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆమెకు భారత పౌరసత్వం రాకుండా దయాకరరావు కుట్ర చేశారని విమర్శించారు. అందుకే ఆమె కోడలు యశస్వినిరెడ్డిని బరిలోకి దింపారని రేవంత్ వివరించారు.
ఎర్రబెల్లి దయాకరరావు నమ్మక ద్రోహి అని రేవంత్ విమర్శించారు. నమ్మించి మోసం చేస్తారని ఆరోపించారు. తాను జైలుకు వెళ్లడానికిి ఎర్రబెల్లే కారణమని స్పష్టం చేశారు. ఆ నాడు టీడీపీని దెబ్బతీసింది దయాకరరావే అని తేల్చిచెప్పారు. ఎర్రబెల్లి దయాకరావు ఓడించాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు.
డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన కేసులు కొట్టేస్తామన్నారు. కార్యకర్తలెవరూ భయపడవద్దని ధైర్యం చెప్పారు.
.
.