Fire Accident : ఢిల్లీ-జైపూర్ హైవే పై బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు సజీవదహనమవ్వగా.. 12 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలైనట్లు గుర్గావ్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 31లోని ఫ్లై ఓవర్ పై రాత్రి 9 గంటలకు ప్యాసింజర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఝార్సా ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. తీవ్రంగా గాయపడిన వారిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారని.. ఏసీపీ వరుణ్ దహియా తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నామని తెలిపారు. ప్రమాదం కారణంగా.. అక్కడ ట్రాఫిక్ జామ్ అవకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా.. మృతుల భౌతికకాయాలు పూర్తిగా కాలిపోవడంతో వాటిని గుర్తించలేకపోయామని తెలిపారు. గుర్గావ్ సెక్టార్ 12 నుంచి ఉత్తరప్రదేశ్ లోని హమీర్ పూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో అధికంగా కూలీలే ఉన్నారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.