కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ పాగా వేసేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజ లను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు మొదలు పెట్టారు. ఒక వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తా మో ప్రజలు హామీలను ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఎస్సీ.. ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు మైనార్టీ, బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు రెడీ అయ్యింది.
గురువారం కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ను ప్రకటించనుంది. నాంపల్లిలో జరిగే కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యులు సల్మాన్ ఖుర్షీద్, నాసిర్ హుస్సేన్, ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హి హాజరవుతారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల ఆర్థిక అభ్యున్నతికి తీసుకునే అంశాలపై డిక్లరేషన్లో పొందుపర్చనున్నారు. తెలంగాణలో మైనార్టీ జనాభా 14 శాతంగా ఉండగా.. 40 నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉండనుంది. మైనార్టీల జనాభా ప్రకారం వారి స్థితిగతులపై అధ్యయనం చేసింది కాంగ్రెస్. జనాభా నిష్పత్తిలో బడ్జెట్ను కేటాయించడానికి మైనారిటీల కోసం సబ్-ప్లాన్ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది. అధికారం చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు ఫైనాన్స్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయనుంది. మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది.
సచార్ కమిటీ, సుధీర్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది. అటు వక్ఫ్బోర్డుకు న్యాయపరమైన అధికారం, వాటి ఆస్తులను కాపాడేందుకు కృషి చేస్తామని డిక్లరేషన్లో ప్రకటించనున్నారు. ముస్లిం సమాజానికి మెరుగైన ఆరోగ్యం, విద్యను అందించడానికి, వారి జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు స్కూళ్లను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వివరించనుంది. మదర్సాలలో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులకు ఉచిత విద్యుత్, నిరుపేద కుటుంబాల ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ముస్లిం విద్యార్థుల ఉన్నత చదువుల కోసం విదేశీ విద్య కింద 20 లక్షలు ఇవ్వనున్నారు. మసీదుల్లో ఇమామ్లు, మౌజన్లందరికీ నెలవారీ గౌరవ వేతనం ఆరు వేలు అందిస్తామని ప్రకటించనుంది.
ఇక క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతామని కాంగ్రెస్ చెబుతోంది. ఫాస్టర్లకు హెల్త్, యాక్సిడెంటల్ ఇన్యురెన్స్ కల్పించనున్నారు. చర్చిల్లో పాస్టర్లు, ఫాదర్లకు గౌరవ వేతనం ఇస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్లో ప్రకటించనుంది.