Shakib Burning Issue : టైమ్డ్ అవుట్.. ఏ ముహూర్తాన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హసన్ ఓ నిర్ణయం తీసుకుని మాథ్యూస్ ని అవుట్ చేశాడో గానీ, అప్పటి నుంచి ప్రపంచమంతా ఏకమై అతని మీద బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇంటా బయటా ఒత్తిడి తట్టుకోలేక, చిరాకొచ్చిన షకీబ్ చేతివేలు గాయం వంక చూపించి, తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయాడని అంటున్నారు. మరి ఈ మాటల వెనుక మర్మమేమిటో ఒకసారి చూద్దాం.
అయితే నిజంగానే గాయం అంత పెద్దదా? లేకపోతే తనంతట తానుగా వెళ్లిపోయాడా? లేక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వచ్చేయమని చెప్పిందా? లేకపోతే ఎందుకిలా చేశావని వివరణ కోరిందా ? కానీ జట్టు మేనేజ్మెంట్ మాత్రం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 82 పరుగులు చేసిన షకీబ్ కి గాయం మరింత పెద్దదైందని అన్నారు. అందుకే వెళ్లిపోయాడని అంటున్నారు. కానీ అంతర్గతంగా ఏదో జరిగే ఉంటుందనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.
ఈ టైమ్డ్ అవుట్ విషయంలో మాత్రం షకీబ్ తీరుపై లంక మాజీ క్రికెటర్లతో పాటు వివిధ దేశాలకు చెందిన క్రికెట్ ప్రముఖులు మండిపడ్డారు. దీనివల్ల ఆ సెగ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి కూడా తగిలిందనే అంటున్నారు. ఎందుకిలా చేశావని వివరణ కూడా కోరినట్టు సమాచారం. అందుకే మనస్థాపం చెంది తను చివరి మ్యాచ్ ఆడకుండా విమానమెక్కేశాడని అంటున్నారు.
ఆడకపోతే పోయేడు.. అంత పెద్ద గాయమైతే శ్రీలంక మీద 82 పరుగులెలా చేశాడని అంటున్నారు. ఒకవేళ నిజంగానే గాయం పెద్దదైతే..క్రీజులో ఉన్నంతసేపు కనీసం వేలు బాధ ఉన్నట్టుగా ఒక్క ఎక్స్ ప్రెషన్ తన నుంచి రాలేదని కొందరు పాయింట్ అవుట్ చేస్తున్నారు. నిజంగా దేశానికి అర్జెంటుగా వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తీరా చూస్తే అది చూపుడు వేలుకి గాయం. కానీ రీజన్ మాత్రం ఏదో ఉంది. వేలు మాత్రం కాదని నెటిజన్లు డిక్టేటర్స్ లా ఆలోచిస్తున్నారు.
అలాగైతే ఆఫ్గాన్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా డబుల్ సెంచరీ వీరుడు మాక్స్ వెల్ తొడ కండరాలు పట్టేశాయ్.. దానికన్నా షకీబ్ ది పెద్ద గాయమా? అని నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇక చివరగా గాయమైతే అయ్యింది. ఇంకొక్క మ్యాచ్ ఆడేస్తే జట్టుతో సహా అందరూ ఎంచక్కా ఇంటికెళ్లిపోవచ్చు కదా.. ఒక్కడే ఇప్పటికిప్పుడే వెళ్లిపోవల్సిన అవసరం ఏముంది? ఏదో జరిగే ఉంటుందని అంటున్నారు. అయితే టైమ్డ్ అవుట్ ఇంత పెద్ద వివాదం అవుతుందని షకీబ్ కూడా ఊహించి ఉండరని కూడా అంటున్నారు.
టైమ్డ్ అవుట్ గుర్తు చేయడం తప్పు కాదు. కాకపోతే మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన విషయంలో తను తప్పు చేశాడని అసలు విషయాన్ని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఆప్షన్ ఉన్నప్పుడు, అంపెర్లు రెండుసార్లు ఆలోచించుకొమ్మని అడిగినప్పుడు, మాథ్యూస్ మూడు, నాలుగు సార్లు రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా అతను కనికరించకపోవడం ఇంత ఆజ్యానికి కారణమైంది.