Earth Quake : వరుస భూకంపాలతో ఆగ్నేయ ఆసియా ద్వీప దేశమైన ఇండోనేషియా వణికిపోతోంది. తాజాగా బుధవారం రాత్రి 8.02 గంటలకు మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. బండా సముద్రంలో ఈ భూకంపం వచ్చినట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా.. ఈ భూకంపం కారణంగా ఎంతమేర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్న వివరాలు తెలియలేదు.
ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీలు వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. దీనికన్నా ముందు.. బుధవారం ఉదయం 11.53 నిమిషాలకు తనింబార్ దీవుల్లోని సౌమ్లాకి పట్టణంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో.. ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇండోనేషియా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటంతో.. భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సముద్రంలో తరచూ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతుండటం వల్ల కూడా ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తాయి. 2004లో సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఒక్క ఇండోనేషియాలోనే లక్ష 70 వేలమంది చనిపోయారు. శ్రీలంక, ఇండియాలతో కలిపి మొత్తం 2 లక్షల 20 వేల మంది మరణించారు.